ఎదులాపురం, డిసెంబర్ 19 : గ్రామాల్లో రక్తహీనతపై ప్రాథమిక అవగాహన, బలవర్ధకమైన బియ్యం ప్రాధాన్యత అంశాలపై డీలర్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో డీలర్లకు నిర్వహించిన రెండు రోజుల అవగాహన సదస్సును కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎనిమియాతో పిల్లలు, గర్భిణులు బాధపడుతున్నందున అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా బలవర్ధకమైన బియ్యం ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా పౌష్టికాహార లోపాలు నివారించవచ్చనే ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డీలర్ల ద్వారా పౌష్టికాహార బియ్యం అందజేస్తున్నదని అన్నారు. ఆ బియ్యం తినడం ద్వారా ఎనిమియా లోపాన్ని అధిగమించవచ్చని తెలిపారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని, సామ్- మామ్ పిల్లల కేసులు తగ్గాయని పేర్కొన్నారు. ఆర్డీవో రాథోడ్ రమేశ్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు ఉన్న అపోహలను నివృత్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, మావల తహసీల్దార్ వనజ, జిల్లా సంక్షేమ అధికారులు కృష్ణవేణి, రాజలింగు, డీఈవో ప్రణీత, ఎయిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కిశోర్ పాల్గొన్నారు.
విద్యార్థుల సామర్థ్యం పెంపునకు కృషి చేయాలి
విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం పెంపునకు కృషి చేయాలని కేంద్ర మంత్రిత్వ విద్యాశాఖ డైరెక్టర్ జేపీ పాండే అన్నారు. సోమవారం న్యూ ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రిత్వ విద్యాశాఖ డైరెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్పీడీ కార్యక్రమంలో భాగంగా అభ్యాసన సామర్థ్యాన్ని పెంచుతూ, ఫలితాలను, తదితర అంశాలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పెంచుతూ, ఫలితాలను అభివృద్ధి చేయడానికి జిల్లా, మండల స్థాయిలో నోడల్ అధికారులను ఏర్పాటు చేశామని వివరించారు. నోడల్ అధికారులు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల బోధన విషయాలు పరిశీలించి టాంజరిన్ యాప్లో నమోదు చేస్తారని అదేవిధంగా ట్రాకర్ యాప్లో ఉపాధ్యాయులు నమోదు చేస్తారని తెలిపారు. మిడ్లెవెల్ కార్యక్రమాల్ని నిర్వహించామన్నారు. వీడియోకాన్ఫరెన్స్లో డీఈవో ప్రణీత, సెక్టోరల్ అధికారి నర్సయ్య, జిల్లా కో ఆర్డినేటర్ అశోక్ పాల్గొన్నారు.