కుంటాల, డిసెంబర్ 19 : నిర్మల్ జిల్లా కుంటాల మండలం సూర్యపూర్ అడవుల్లో చిరుతపులి మృతి కలకలం రేపింది. సూర్యపూర్ సమీపంలో పెద్ద చెరువును ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరాన్ని గ్రామానికి చెందిన ఓ యువకుడు సోమవారం గుర్తించాడు. ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలిసింది. దీంతో చిరుత మృతి వైరల్గా మారింది. బండరాళ్ల మధ్యన చిరుత మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మూడు, నాలుగు రోజుల క్రితమే ఇది మృతి చెందినట్లు తెలుస్తున్నది. కాళ్లు, ఇతర భాగాల్లో గాయాలై ఉండడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల నుంచి కుంటాల మండలంలోని దౌనెల్లి, అంబుగాం, సూర్యపూర్ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లున్నాయి. పశువులు, గొర్రెల కాపరులు సైతం దీనిని గుర్తించారు. అటవీ శాఖ అధికారులు సైతం పులి పాదముద్రలను గుర్తించి సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా, చిరుత మృతి వార్త తెలుసుకున్న అటవీ, పోలీస్ శాఖ అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు. ఎఫ్ఆర్వో రాథోడ్ రమేశ్, శిక్షణాధికారి కోటేశ్, బీట్ అధికారిని మీన చిరుత కళేబరాన్ని పరిశీలించారు. కళేబరాన్ని పోస్టుమార్టంతో పాటు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపనున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిపి చిరుతను వేటాడినట్లు తెలిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వేటగాళ్ల పనేనా.. ?
కుంటాల మండలంలోని అటవీ సమీప గ్రామాల్లో ఓ వేటగాళ్ల ముఠా కొన్ని నెలలుగా అడవి జంతువులను వేటాడుతున్నది. అడ వి పందులతో పాటు జింక లు, మనుబోతులు, ఇతర వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నది. కుంటాల, ఓల, గొల్లమాడకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ప్రత్యేక వలలు, విద్యు త్ తీగలను అమరుస్తూ అడవి జంతువులను వేటాడుతున్నట్లు సమాచారం. వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిరుతపులి చిక్కి మృతి చెందడంతో గుట్టుచప్పుడు కాకుండా సూర్యపూర్ అటవీ ప్రాంతంలో పడేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు సమీపంలో నీటి కోసం వచ్చే వివిధ రకాల జంతువులను చిరుత పులి వేటాడుతూ ఆహారం కోసం ఈ ప్రదేశంలో సం చరిస్తుందని రైతులు తెలిపారు. మరోవైపు ఎవరైనా రైతులు తమ పంటలకు రక్షణగా విద్యుత్ తీగలను అమర్చారా? అమరిస్తే విద్యుత్ షాక్తో చనిపోయిందా? అన్న కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు.