ఆదిలాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతు, ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రజల తిరుగుబాటు తప్పదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్ రావు ఆదిలాబాద్, ఉట్నూర్లో శుక్రవారం పర్యటించారు. జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు ఆ యన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే లు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, ఎమ్మెల్సీ దండె విఠల్, టీఎస్ ఎమ్ఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీ జీ నగేశ్, నాయకులు యూనిస్ అక్బానీతో కలిసి మద్దతు ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్రోల్, డీజీల్, వంటగ్యాస్, ఎరువుల ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు కట్టెల పోయ్యిలను వాడుకునే పరిస్థితి నెలకొందన్నారు.
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునః ప్రారంభించాలని సాధన కమిటీ ఆధ్వర్యంలో రెండు నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్నా, కేంద్రం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు సీసీఐపై కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. సీసీఐని తెరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని, రాయితీ కల్పిస్తుందని ఇదివరకే కేంద్రానికి తెలియజేసినా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని మండిపడ్డారు. సీసీఐ పునరుద్ధరణ బీజేపీ ప్రభుత్వానికి చేతకాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, తాము ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగులు, పరిశ్రమలపై ఆధారపడిన వారిని రోడ్డుపాలు చేస్తున్నదని తెలిపారు. అనంతరం ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యసేవలు..
గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానను సందర్శించిన ఆయన, వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు, వైద్యులతో సమావేశం నిర్వహించారు. దవాఖానలో ప్రసవాల సంఖ్య పెంచాలని, సర్కారు వైద్యంపై మరింత నమ్మకం కల్పించాలని సూచించారు. మార్చురీ గదిని నిర్మించడంతో పాటు ఫ్రీచర్లకు ప్రతిపాదనలు పంపాలని, సర్జికల్ పనిముట్లు, మౌలిక సదుపాయాలు, ఇతర మరమ్మతులకు నిధులు కేటాయిస్తామన్నారు. జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో అంకిత్, టీఎస్ ఎమ్ఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కెరావు, జిల్లా అదనపు వైద్యాధికారి కుడ్మిత మనోహర్ పాల్గొన్నారు.