నార్నూర్, మార్చి 4 : ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కరుణ వాకటి పేర్కొన్నారు. మండలంలోని ఝరి, గాదిగూడ పీహెచ్సీలను శుక్రవారం ఆమె సందర్శించారు. పరిసరాలు, ప్రసవ గదులు, వైద్యం అందించే తీరుపై ఆరా తీశారు. ప్రసవ గదిలో ఓ బాలింతతో మాట్లాడారు. శిశువును ఎత్తుకొని బుజ్జగించారు. గిరిజన ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుండడంతో వైద్య సిబ్బంది పనితీరును అభినందించారు. జిల్లాలోనే గాదిగూడ మారుమూల మండలం అయినప్పటికీ ప్రజలకు వైద్య సేవలు చాలా బాగా అందిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ కిట్ల పంపిణీ గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్దేశం నెరవేర్చే విధంగా వైద్యాధికారులు, సిబ్బంది పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా పేదలకు వైద్యం అందించడంలో సేవాభావంతో పనిచేయాలని సూచించారు. దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గతంలో మాదిరి కాకుండా ఆస్పత్రులను పటిష్టం చేయాల్సి ఉందన్నారు. గాదిగూడ మండల కేంద్రంలో 30 పడకల దవాఖాన మంజూరు చేయాలని, 24 గంటలు వైద్య సేవలు అందించాలని, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని ఎంపీపీ ఆడా చంద్రకళారాజేశ్వర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. కమిషనర్ వెంట అదనపు కలెక్టర్ రిజ్వాన్భాషా, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, రాష్ట్రీయ నోడల్ అధికారి నిరంజన్, డిప్యూటీ డీఎంహెచ్వోలు సాధన, విజయ్కుమార్, మెడికల్ అధికారి పవన్కుమార్, సిబ్బంది ఉన్నారు.
దంతన్పెల్లి పీహెచ్సీ పరిశీలన..
ఉట్నూర్ మండలంలోని దంతన్పెల్లి పీహెచ్సీని ఐటీడీఏ పీవో అంకిత్తో కలిసి వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పీహెచ్సీల్లోనే మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. దంతన్పెల్లి పీహెచ్సీకి జాతీయస్థాయిలో గుర్తింపు రావడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. మిగతా పీహెచ్సీలు కూడా ఇదే తరహాలో సేవలు అందించాలని సూచించారు. కమిషనర్ వెంట వైద్యురాలు అనురాధ, సిబ్బంది, తదితరులు ఉన్నారు.