ఎదులాపురం, డిసెంబర్ 16 : క్రైస్తవుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని మోరియా చర్చిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ తమ ప్రభుత్వం కానుకలను అందజేస్తుందని పేర్కొన్నారు. అన్ని మతాలకు సమ ప్రాధాన్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ తాత సంబురాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఆర్డీఏ కిషన్, మున్సిపల్ కమిషనర్ శైలజ, వార్డు కౌన్సిలర్ మీషు, చర్చి నిర్వాహకులు ప్రెసిడెంట్ రాకేశ్, ప్రసన్న కుమార్, సంజీవ్, చంద్రశేఖర్, నవీన్, తదితరులు ఉన్నారు.
అభివృద్ధి పనులు పరిశీలన
పట్టణాభివృద్ధి కోసం ఆదిలాబాద్ ఎంపీ ఇస్తానన్న రూ.11 కోట్లు మంజూరు చేయించే దిశగా బీజేపీ నాయకులు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ డిమాండ్ చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా కైలాస్నగర్లో చేపడుతున్న ఇండోర్ స్టేడియం పనులను కౌన్సిలర్ అర్చనారాంకుమార్తో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ఎమ్మెల్యే జోగు రామన్న చేస్తున్న పట్టణాభివృద్ధిలో ఎంపీ నిధులు సహకరించినట్లయితే మరింత అభివృద్ధి సాధించగలుగుతామని పేర్కొన్నారు. జోగు రామన్న కృషితో కోట్ల రూపాయాల నిధులను మంజూరు చేసుకొని పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తూ వారి సౌకర్యార్థం రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం పనులను పూర్తి చేస్తున్నామన్నారు. అలాగే పట్టణ పరిశుభ్రతకు అధునాతనంగా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తూ డీఆర్సీ సెంటర్ కరెంట్ అనుమతులు అప్రూవల్ రావడం జరిగిందన్నారు. దీని ద్వారా ఎఫ్ఎస్టీపీతో పాటు ఏనిమల్ కేర్ సెంటర్, చెత్తశుద్ధి కర్మాగారాల పని విధానాల్లో బయోమెట్రిక్ విధానంతో పాటు చెత్త ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రారంభిస్తామన్నారు. త్వరలో తాటిగూడలో రాణిసతీజీ, భుక్తాపూర్ కాలనీలో నూతన పార్కులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఆయన వెంట కౌన్సిలర్ ఉన్నారు.