నిర్మల్ చైన్గేట్, డిసెంబర్16: దివ్యాంగుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్న దని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్లోని అంబేద్కర్ భవనంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. రిట్రోఫిట్టెడ్ మోటార్ వెహికల్(టీవీఎస్ స్కూటీ) 19, బ్యాటరీ వీల్చైర్స్ 14, ల్యాప్ టాప్స్- 4, స్మార్ట్ఫోన్స్ -6, డైసీప్లేయర్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా వారికి పింఛ న్లు ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 10654 మంది దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన దివ్యాంగులకు 64 డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించినట్లు చెప్పారు.
దివ్యాంగులను కించపరిచితే చర్యలు తీసుకోవా లని పోలీసులను ఆదేశించారు. దివ్యాంగుల అభ్యున్నతికి అన్నివేళలా అండగా ఉంటానన్నారు. సదరమ్ ధ్రువీకరణ పత్రాలు ఉన్న వారందరికీ పింఛన్లు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన వారిని మంత్రి అభినందించారు. దివ్యాంగుల చట్టంపై రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు. సందీప్ అనే విద్యార్థి నృత్యం చేయగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. దివ్యాంగుల హెల్ప్లైన్ నంబర్ 155326 కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి విజయలక్ష్మి, దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చట్టి సాయన్న, ఐసీడీఎస్, పలు శాఖల అధికారులు, కౌన్సిలర్లు, దివ్యాంగులు పాల్గొన్నారు.
భీమన్న ఆలయ నిర్మాణానికి భూమి పూజ
దిలావర్పూర్, డిసెంబర్ 16 : మండలంలోని కదిలి గ్రామంలో భీమన్న ఆలయ నిర్మాణానికి మంత్రి అల్లోల భూమి పూజ చేసినారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి మాడెగాంలోని అయ్యప్ప పడిపూజలో పాల్గొన్నారు. దీక్షాపరులు మంత్రిని సన్మానించారు. అనంతరం గుండంపల్లిలో రూ.36లక్షలతో చేపట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ సరిత, ఎంపీపీ పాల్దే అక్షర, బన్సపల్లి పీఏసీఎస్ చైర్మన్ పీవీ రమణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్ఖాన్, మండల ఉపాధ్యక్షుడు బాబురావు, కదిలి ఆలయ కమిటీ చైర్మన్ భుజంగ్రావు, నాయకులు అడెపు శ్రీనివాస్,పాల్దే అనిల్, పాల్దే శ్రీనివాస్,రాజు, సంభాజీ పటేల్, మారుతి పటేల్, ఎల్లయ్య, మోహన్ పటేల్, రాథోడ్ అశోక్, ఆనంద్ పటేల్ ఉన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం..
సోన్, డిసెంబర్ 16 : బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోన్ మండలం న్యూవెల్మల్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ముడపల్లి సాయవ్వ ఇటీవల ప్రమాదవశాత్తు సరస్వతీ కెనాల్లో పడి మృతి చెందింది. ఆమెకు బీఆర్ఎస్ సభ్యత్వం ఉండగా మంత్రి అల్లోల తన నివాసంలో తండ్రి గంగారాంకు బీమా చెక్కు అందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, బీఆర్ఎస్ సోన్ మండల కన్వీనర్ మొహినొద్దీన్, సర్పంచ్ అంకం గంగామణి శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, సోన్ సర్పంచ్ వినోద్, నాయకులు కిరణ్రావు, ప్రకాశ్ పాల్గొన్నారు.