బాసర, డిసెంబర్ 16 : బాసర ట్రిపుల్ ఐటీ చరిత్రలో పలు యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం ఒక మైలు రాయిగా నిలుస్తుందని మిగులుతుందని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ అన్నారు. హైదరాబాద్లోని జేఎన్టీయూలో శుక్రవారం నిర్వహించిన ఈ సమ్మిట్ కార్యక్రమంలో ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ కుమార్ కలిసి ట్రిపుల్ఐటీ హైదరాబాద్ డైరెక్టర్ నారాయణ్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్మూర్తి, ఫారెస్టు కళాశాల ఐఎఫ్ఎస్ డీన్ ప్రియాంక వర్గీస్తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా పాఠ్యాంశాలకు సంబంధించిన మార్పులు, చేర్పులు చేయడానికి సహకారంతో పాటు ఉన్నత విద్య అవకాశాలపై పూర్తి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి సెమినార్లు, సమావేశాలు, వర్క్షాప్లు నిర్వహించనున్నారు.
జాతీయ, అంతర్జాతీయ నిధులు సమకూరుస్తున్న ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధన్యమిస్తూ పరిశోధన ప్రాజెక్టులను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఫారెస్ట్ కళాశాలతో ఒప్పందం ద్వారా సివిల్ ఇంజినీరింగ్ విభాగం సహకారంతో అటవీరంగం, అటవీ ఆధారిత ఉత్పత్తులు, గిరిజన గ్రామీణులకు సాయం అందించడం, తెలంగాణ సామర్థ్యాన్ని గొప్పగా చాటేందుకు ఉపయోగ పడుతుందని ప్రియాంక వర్గీస్ తెలిపారు. బాసర ట్రిపుల్ఐటీలో త్వరలో గ్రీన్హబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులు , అధ్యాపకులకు ప్రోత్సహం అందిస్తామని ట్రిపుల్ఐటీ హైదరాబాద్ డైరెక్టర్ నారాయణ్ తెలిపారు. బాసర ట్రిపుల్ఐటీకి ప్రత్యేక స్థానం ఉందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. కార్యక్రమంలోబాసర ట్రిపుల్ఐటీ డీన్లు చంద్రశేఖర్, దేవరాజ్, పావని, వినోద్, హరిబాబు, రాకేశ్ రెడ్డి, సారిక, రవీందర్రెడ్డి, పాల్గొన్నారు.