ఇచ్చోడ, డిసెంబర్ 15 : మన ఊరు-మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. మండలంలోని అడెగాం(బీ), ఇస్లాంనగర్ పాఠశాలల్లో చేపట్టిన మన ఊరు-మన బడి పనులను గురువారం పరిశీలించారు. మధ్యాహ్న భోజనం, విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మన ఊరు-మన బడి పనుల్లో నాణ్యత లోపించవద్దని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఎంఈవో రాథోడ్ ఉదయ్రావు, ఏఈ అభినవ్, అడిగాం(బీ), ఇస్లాంపూర్ సర్పంచ్లు అనిత, అమీనాబీ, అధికారులు ఉన్నారు.
ఆరోగ్యకేంద్రం తనిఖీ
మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తనిఖీ చేశారు. దవాఖానలోని రికార్డులను పరిశీలించారు. గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. అందిస్తున్న చికిత్స వివరాలను మెడికల్ ఆఫీసర్ ఆకుదారి సాగర్ను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 21న ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బోథ్, ఇచ్చోడ ఆరోగ్య కేంద్రాలను సందర్శించనుండగా ముందస్తుగా ఆరోగ్య కేంద్రాల రికార్డులను పరిశీలించారు. వారి వెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సాగర్, తహసీల్దార్ మోహన్ సింగ్, సిబ్బంది రాథోడ్ కైలాస్, రెవెన్యూ సిబ్బంది గంగయ్య పాల్గొన్నారు.