ఇంద్రవెల్లి, డిసెంబర్15 : నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలతో పాటు ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాం తాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు కుమ్ర దత్తు మహారాజ్, మరప పుండలిక్మహారాజ్ ఆధ్మాత్మిక ప్రవచనాలు బోధించారు. భక్తు లు, మెస్రం వంశీయులు నాగోబాను దర్శిచుకొని పూజలు చేస్తున్నారు.
ఆలయ స్తంభా లపై చెక్కిన వివిధ రకాల పడియోరు శిల్పాలను భక్తులు చూసి ఆనందిస్తున్నారు. వలంటీర్లు విస్తృతంగా సేవలు అందిస్తున్నారు. ‘మెస్రం’ సంస్కృతికి నిలయం నాగోబా భారతీయ దేవాలయ పీఠాధిపతి కమలానందన్ భారతీ స్వామి నాగోబా ఆలయాన్ని గురువారం సందర్శించారు. నాగోబా ఆలయ చరిత్రతోపాటు మెస్రం వంశీయుల సంస్కృతీసంప్రదాయాలను తెలుసుకున్నారు.
జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెస్రం వంశీయులతోపాటు ఆదివాసీ గిరిజన గోండుల సంస్కృతీ సంప్రదాయలకు నాగోబా ఆలయం నిలయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాగోబా దేవస్థానం రెండో అతిపెద్ద ఆలయమని చెప్పారు. కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ పటేల్, మెస్రం వంశీయులు జంగుపటేల్, దాదారావ్, గణపతి, కోసు కటోడ, ఆనంద్రావ్, షేకు, బాదిరావ్, లింబారావ్ పాల్గొన్నారు.
జాతర ఏర్పాట్లపై త్వరలో సమీక్ష
నాగోబా జాతర ప్రారంభం కానున్న సందర్భంగా ఏర్పాట్లపై త్వరలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి తెలిపారు. నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనతోపాటు ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఐటీడీఏ పీవో ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో పూజలు చేసి నాగోబాను దర్శించుకున్నారు. మెస్రం వంశీయులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముత్నూర్ నుంచి కెస్లాపూర్ వరకు రోడ్డుకు మరమ్మతు చేస్తామని చెప్పారు. ఆలయ అవరణలో భక్తులకు తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, మెస్రం వంశీయులు నాగ్నాథ్, శేఖర్బాబు, ఆనంద్రావ్, దేవ్రావ్, సోనేరావ్, మానిక్రావ్, దేవ్రావ్ పాల్గొన్నారు.