కాసిపేట, డిసెంబర్ 14 : మాదిగలకు బీజేపీ చేసిన ద్రోహాన్ని మరవద్దని, ఆ పార్టీని నమ్మితే మిగిలేది బూడిదేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ పేర్కొన్నారు. కాసిపేట మండలం సోమగూడెంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే వర్గీకరణ మరిచిపోయిందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని మేనిఫెస్టోలో చేర్చి, దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతటికైనా దిగజారుతుందన్నారు. బీజేపీకి రాజకీయ విలువలు ఉంటే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా బీజేపీ నేతలు మాదిగ వాడల్లోకి రావద్దని హెచ్చరించారు. బీజేపీ చేసిన ద్రోహాన్ని మాదిగ ప్రజలు మరిచిపోకుండా తగన గుణపాఠం చెప్పాలన్నారు. జనవరి 6న బెంగుళూర్లో జరిగే ఎమ్మార్పీఎస్ జాతీయ బహసభలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మండల కమిటీని ఎన్నికున్నారు. అధ్యక్షుడిగా దాసరి వినయ్, ఉపాధ్యక్షుడిగా మాడుగుల వినోద్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి కల్వల శరత్ ఎమ్మార్పీఎస్ కన్వీనర్ చెన్నూరు సమ్మయ్య, కో కన్వీనర్ సుందిళ్ల మల్లేశ్, నియోజకవర్గ ఇన్చార్జి జలంపల్లి శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ వడ్లకొండ సంజయ్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్ అశోక్, కాసిపేట మండల కోఆర్డినేటర్ పంగ లక్ష్మణ్, ఉద్యోగుల సంఘం నాయకులు దాసరి శంకర్, దాసరి వినయ్ పాల్గొన్నారు.