నిర్మల్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): ఏటా గోదావరికి వస్తున్న వరదల కారణంగా ఎదురవుతున్న పరిస్థితులు ఇటు పరీవాహక ప్రజానీకానికి, అటు అధికార యంత్రాంగానికి ప్రాణసంకటంగా మారుతున్నది. ఎగువ నుంచి లక్షల క్యూసెక్కుల్లో ప్రవాహం వస్తుండడంతో, ఏమవుతుందోనని లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తున్నది. ఎన్నో ఏళ్లుగా ఎదురవుతున్న ఈ సమస్యకు చెక్పెట్టేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది. పటు చోట్ల భద్రాచలం తరహాలో కరకట్టల నిర్మాణానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షించగా, ప్రతిపాదనల ఫైల్ వ్యయ అంచనాలతో సహా ప్రభుత్వానికి చేరింది.
వరద ఉ ధృతి కారణంగా పరీవాహక ప్రాంతాలు చాలా చోట్ల జలమయమవుతుండడమే కాకుండా వరద పంట చేలను ముంచెత్తుతుండడం, అలాగే ఇళ్లలోకి వస్తుండడం సమస్యగా మారింది. దీనికి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభు త్వం గత కొంత కాలంగా పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నది. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులతో పలుమార్లు జిల్లా ప్రజాప్రతినిధులు సమీక్షా సమావేశాలను నిర్వహించి ప్రత్యామ్నాయ చర్యలను రూపొందించాలంటూ సూ చించారు. దీనిపై సీరియస్గా కసరత్తు జరిపిన ఇక్కడి నీ టిపారుదల శాఖ అధికారులు భద్రాచలం తరహాలో యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఇటీవలే జిల్లాకు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశమై ఈ భద్రాచలం తరహా కరకట్టల నిర్మాణంపై అధికారులు రూపొందించిన యాక్షన్ ప్లాన్పై సుదీర్ఘంగా చర్చించారు.
అయితే ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం గోదావరి పరీవాహక ప్రాంతంలో నదికి ఇరువైపులా కరకట్టలను నిర్మించాలని భావిస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి మొదలుకొని సోన్ మీదుగా ఖానాపూర్ వరకు దాదాపు 40 కిలోమీటర్ల పొడవుతో ఈ కరకట్టలను నిర్మించాలని తలపెడుతున్నారు. ఇరువైపులా ఈ కరకట్టలను నిర్మించేందుకు సుమారు రూ. 70 కోట్లకు పైగా వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఏటా వానకాలం సీజన్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 4 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి ఎగువ మహారాష్ట్రతోపాటు, ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వ ర్షాలు కురిసినప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతున్నది.
ప్రతిసారి గోదావరి పరీవాహక ప్రాంతా ల ప్రజలను వరద సమయంలో అప్రమత్తం చేస్తూ ప్రా జెక్టు గేట్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. అ యితే ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతున్న కారణం గా ఒకే సారి గేట్లను ఎత్తి గోదావరిలోకి ఆ నీటిని వదలాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. దీంతో పరీవాహక ప్రాంతాల్లోకి వరద చేరుకోవడం జనాలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇలాంటి నేపథ్యంలో అధికారులు కరకట్టల నిర్మాణాన్ని తెరపైకి తెచ్చి ఏళ్లుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు ఓ పరిష్కార మార్గం చూపే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఈ కరకట్టల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను పకడ్బందీగా రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వం కరకట్టల నిర్మాణానికి ఆమోదం తెలిపి నిధులను మంజూరు చేస్తే వచ్చే వానకాలం లోపే పనులు మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
భద్రాచలం తరహాలోనే..
భద్రాచలంలో ఏటా గోదావరి వరదల కారణంగా పట్టణంతో పాటు భద్రాద్రి ఆలయ పరిసరాలు జలమయమయ్యేవి. దీనిని నివారించేందుకు అక్కడి ఇరిగేషన్ అధికారులు చేపట్టిన కరకట్టల నిర్మాణం సత్ఫలితాన్నిచ్చింది. దీంతో ఇదే ఫార్ములాను ఇక్కడ కూడా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నీటిపారుదల శాఖ అధికారులు ఇటీవల భద్రాచలాన్ని సందర్శించి అక్కడి కరకట్టల నిర్మాణాలు, వాటితో జరుగుతున్న ఉపయోగాలను పరిశీలించారు. ఎస్సారెస్పీ నుంచి సోన్ మీదుగా ఖానాపూర్ వరకు గల గోదావరి నదికి ఇరువైపులా వీటిని ప్రయోగాత్మకంగా నిర్మించాలని తలపెట్టారు.
సోన్ వద్ద భారీ చెక్ డ్యాం
కాగా ఎస్సారెస్పీ దిగువన ఉన్న సోన్ గోదావరి వద్ద ఏటా వేసవిలో నీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. పుణ్య కార్యాలతో పాటు దహన సం స్కారాల కోసం గోదావరి వద్దకు వచ్చే వారంతా నీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే సోన్ గోదావరి వద్ద నది మధ్యలో దాదాపు కిలో మీటరు పొడవుతో చెక్డ్యాంను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించా రు. ఇప్పటికే ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారులు చెబుతున్నారు. దీని కోసం గాను రూ.48 కోట్లు అవుతుందని అంచనా వేశారు.
ముంపును నివారించేందుకే కరకట్టలు..
ఎస్సారెస్పీకి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చినప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పంట చేలల్లోకి భారీగా వరద వస్తున్నది. ఇటీవల 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో లక్ష్మణచాంద మండలంలో భారీ నష్టం జరిగిం ది. దీన్ని నివారించాలంటే కరకట్టల నిర్మాణం ఒక్కటే పరిష్కార మార్గం. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ఎస్సారెస్పీ నుంచి ఖానాపూర్ వరకు దా దాపు 40 కిలోమీటర్ల పొడవున కరకట్టల నిర్మాణం జరుపాలని, అప్పుడే ముంపును అరికట్టవచ్చని చర్చ జరిగింది. ఇందుకు అవసరమైన అంచనాలను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. -బీ.రామారావు, ఈఈ, నీటిపారుదల శాఖ, నిర్మల్
కరకట్టలతోనే శాశ్వత పరిష్కారం..
గోదావరికి భారీగా వరద వచ్చినప్పుడు నిర్మల్ జిల్లాలోని నది పరీవాహక గ్రామాల్లోకి నీరు వచ్చి చేరుతున్నది. పంటలకు నష్టం వాటిల్లుతున్నది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వానకాలంలో ఈ సమస్యతో భారీ నష్టం వస్తున్నది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో ఎస్సారెస్పీ నుంచి ఖానాపూర్ వ రకు గోదావరికి ఇరువైపులా గట్టు పైన కరకట్టలను నిర్మించాలని నిర్ణయించాం. ఇం దుకు అవసరమైన అంచనాలను రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాం. ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే పనులు ప్రారంభమవుతాయి.
–అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర అటవీ,పర్యావరణ మంత్రి