ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 14 : సమాజ శ్రేయస్సును కోరుతూ వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని డీఈవో ప్రణీత అన్నారు. చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం పట్టణంలోని భవిత కేంద్రంలో అమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఈవో చేతుల మీదుగా విద్యార్థులకు స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందు ఉన్నారని, వారి తల్లిదండ్రులు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నిరంతరం ప్రోత్సహిస్తూ ఉన్నత స్థానాలకు చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. యువత సామాజిక సేవలో భాగస్వాములు కావడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్ అడ్వకేట్ ఉరోజ్ఖాన్, సెక్టార్ ఇన్చార్జి ఉదయ శ్రీ, ఐఆర్ఈసీ కోఆర్డినేటర్ సుజాత్ ఖాన్, జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు బాల శంకర్ కృష్ణ, అమన్ ఫౌండేషన్ అధ్యక్షుడు అర్పాత్ ఖాన్, పరమేశ్వర్, రాహుల్, అజీమ్ పాల్గొన్నారు.
గణిత పరిజ్ఞానంతో ఉన్నత స్థానానికి ఎదగాలి
జిల్లా కేంద్రంలోని ఆర్పీఎల్ ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈవో ప్రణీత హాజరై మాట్లాడారు. విద్యార్థులు గణిత పరిజ్ఞానంతో అధిగమించి, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి సుజాత్ ఖాన్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.