ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 9: ఐటీడీఏ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలో విద్యా బోధన, వసతుల పరిశీలనకు పీవో వరుణ్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 10 నుంచి 30 వరకు ప్యానెల్ టీంలు తనిఖీలు చేపట్టనున్నాయి. ఇందుకు 2 రోజల పాటు కేబీ కాంప్లెక్స్లోని సమావేశ మందిరంలో సీనియర్ పీజీ హెచ్ఎం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ టీంలో ఉన్న ఉధ్యాయులు ఆయా పాఠశాలల్లో వసతులు, ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి, నివేదికలను కమిషనర్ కార్యాలయానికి పంపిచనున్నారు. వీటి ఆధారంగా మరిన్ని సదుపాయాలు, ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నారు.
ఐటీడీఏ పరిధిలోని పాఠశాలలు
ఐటీడీఏ పరిధిలోని ఆదిలాబాద్లో 49, కుమ్రం భీం అసిఫాబాద్లో 41, నిర్మల్లో 17, మంచిర్యాలలోని 16 పాఠశాలలను తనిఖీ చేయనున్నారు. ప్యానెల్ టీంలకు తనిఖీ రోజు కేటాయించిన పాఠశాలలకు ఉదయం 9 నుంచి రాత్రి 7గంటల వరకు పరిశీలించి నివేదికలు రూపొందిస్తారు. ప్రతి ఉపాధ్యాయుడి నుంచి బోధన తీరు, పాఠ్యాంశాల ప్రణాళిక తీరును పరిశీలించి గ్రేడింగ్లు కేటాయిస్తారు. ప్రతీ పాఠశాలను మూడు భాగాలుగా విభజించి ప్యానెల్ టీంలు తనిఖీలు నిర్వహిస్తాయి. మొదటి భాగం తరగతి పరిశీలన, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలు, రెండో భాగం పాఠశాల వసతులు, మూడో భాగం హాస్టల్లో వసతులు, నిర్వహణను పరిశీలిస్తారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
పాఠశాలల్లో ప్యానెల్ టీంల ద్వారా తనిఖీలు చేపట్టే అంశాలపై శిక్షణ పూర్తి చేశాం. తనిఖీల నిర్వహణ తేదీలు ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు తెలియజేశాం. పాఠశాలలకు అవసరమైన వసతులు, తరగతి గదులు, శానిటేషన్ వంటి వసతులు కల్పించడానికి నివేదికలు దోహదం చేస్తాయి. నివేదికలు, ఉపాధ్యాయుల వివరాలు పకడ్బందీగా రూపొందించి ప్రాజెక్టు అధికారి ద్వారా ఆదేశాలు జారీ చేశాం.
-ఏసీఎంవో జగన్