సోన్, డిసెంబర్ 9 : ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. శుక్రవారం ఆయన సోన్ మండలంలోని న్యూవెల్మల్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఫ్లోరింగ్, విద్యుత్, తరగతి గదుల పురోగతి పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల ఆవరణలో విద్యార్థులకు అందుబాటులో ఉండేలా క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఈ నెల 24లోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఈ తుకారాం, తహసీల్దార్ హిమబిందు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, ఎంపీడీవో సాయిరాం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.