నిర్మల్ టౌన్, డిసెంబర్ 6 : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం టీఆర్ఎస్ నేతలు గండ్రత్ ఈశ్వర్, రామేశ్వర్రెడ్డి, ధర్మాజీ రాజేందర్, మారుగొండ రాము, నజీర్అహ్మద్ మాట్లాడారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో పాల్గొన్న బండి.. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి అల్లోలపై అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అవినీతి, అక్రమాల్లో అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పాత్ర ఉన్నదని చెప్పిన బండి సంజయ్.. వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. తాము పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తుంటే జీర్ణించుకోలేక మైనార్టీ వర్గానికి 40 శాతం ఇండ్లు ఇచ్చారని చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్పై గౌరవం లేకుండా మాట్లాడిన బండి సంజయ్పై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. రాష్ర్టానికి ఒక్క రూపాయి సాయం చేయలేని బీజేపీ, ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసిన ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రజలకు తెలుసునన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు చిలుక రమణ, మెరుగు సత్యనారాయణ, వేణు, చారి, రిజ్వాన్, జగదీశ్, నవీన్, కిషన్, పోతన్న, ధర్మాజీ శ్రీనివాస్, సాయికృష్ణ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.