నిర్మల్ (నమస్తే తెలంగాణ), డిసెంబర్ 6 : సంప్రదాయ శవదహనాల వల్ల పొగ, దుర్వాసన వస్తుండడం.. కట్టెల కొరత ఏర్పడడం.. ఖర్చులు తడిసిమోపెడు అవుతుండడంతో సర్కారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. ఎలక్ట్రిక్ దహన వాటికలు నిర్మించినప్పటికీ నిర్వహణ, విద్యుత్ బిల్లుల భారం, సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో ఎల్పీజీ(లిక్విడ్ పెట్రోలియం గ్యాస్) డబుల్ బర్నల్ క్రిమిటోరియాల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నది. అధిక జనాభా గల మున్సిపాలిటీల్లో నిర్మించాలని భావిస్తున్నది. ఇప్పటికే మంచిర్యాల బల్దియాలోని అండాళమ్మ కాలనీలో ఉండగా.. ఇవి నిర్మల్ బల్దియాలో నిర్మించాలని తలపెట్టింది. అధికారులు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభం కానుండగా.. మొత్తం యూనిట్ రెండు,మూడు నెలల్లో పూర్తయి అందుబాటులోకి రానున్నది.
శవ దహనాల వల్ల ఏర్పడుతున్న పర్యావరణ సమస్యను దశలవారీగా పరిష్కరించడానికి రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. ఇందు లో భాగంగా బల్దియాల్లో ఎల్పీజీ(లిక్విడ్ పెట్రోలియం గ్యాస్) శవదహన వాటికలను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ దహన వాటికలు ఉన్నప్పటికీ వాటి నిర్వహ ణ, విద్యుత్ బిల్లుల భారం తడిసి మోపెడు అవుతుండడం, సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నందున ఎల్పీజీ శవదహన వాటికలను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చే యడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉం ది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని అండాళమ్మ కాలనీ సమీపంలో ఈ ప్లాంట్ పనులను మే 21, 2021న ప్రారంభించి జూన్ 25న పూర్తి చేశారు. ఎల్పీజీ డబుల్ బర్నల్ క్రిమిటోరియానికి రూ.12 లక్షలు కాగా.. షెడ్డు, బోరు, ట్యాంక్కు కలిపి రూ.10 లక్షలు ఖర్చయ్యాయి. ఈ మొత్తం రూ.22 లక్షలను మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి కేటాయించారు. 2021 ఆగస్టులో స్థానిక ఎమ్మెల్యే దివాకర్రావు, కలెక్టర్ భారతీ హోళికేరి ప్రారంభించారు. ఇదే తరహాలో నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రణాళికలు రూపకల్పన
నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో గల ప్రధాన శ్మశాన వాటికలో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే నిర్మల్ మున్సిపల్ అధికారులు ఎల్పీజీ డబుల్ బర్నల్ క్రిమిటోరియం పేరిట ఈ-కొటేషన్లు పిలిచారు. వీటితోపాటు శ్మశాన వాటికల్లో సాధారణ దహన వాటికను కూడా కొనసాగించనున్నారు. దశలవారీగా సాధారణ దహన వాటికల వినియోగాన్ని తగ్గించి.. క్రమంగా ఎల్పీజీ దహన వాటికల ప్రాధాన్యతను పెంచాలని యోచిస్తున్నారు. ఇలా నిర్మల్ మున్సిపాలిటీతోపాటు అధిక జనాభా గల మంచిర్యాల మున్సిపాలిటీలో కూడా ఎల్పీజీ దహన వాటికలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటుండడంతో త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.
వైకుంఠధామాల్లో ప్రత్యేక వాటికలు
నిర్మల్లో రూ.6 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న మాడల్ వైకుంఠధామంలో పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక్కడే ఎల్పీజీ క్రిమిటోరియం కోసం ప్రత్యేక వాటికను ఏర్పాటు చేయనున్నారు. ఈ దహన వాటిక నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించనున్నారు. ఇందులో ఎల్పీజీ ఫర్నేస్తోపాటు బూడిద సేకరణ పరికరం, ఎల్పీజీ బర్నర్లు, ప్రత్యేక కంట్రోలర్లు, ఎల్పీజీ గ్యాస్ పైప్లైన్, 30 అడుగుల చిమ్ని, బ్లోయర్ బెల్ట్ లాంటివి ఏర్పాటు చేయనున్నారు. మొత్తం యూనిట్ను రెండు, మూడు నెలల్లో అమర్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.
బహుళ ప్రయోజనాల కోసమే..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ శవదహన విధానంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్న కారణంగానే ప్రత్యామ్నాయ శవదహన విధానాన్ని తెరపైకి తెస్తున్నా రు. ప్రస్తుతం కట్టెలతో బహిరంగంగా శవదహనాలు చేస్తుండడం వల్ల పొగ, వాసనతో పర్యావరణ ఇబ్బందు లు తలెత్తుతున్నాయి. అలాగే జనావాసాలకు కూడా ఇది సమస్యగా మారుతున్నది. దీంతోపాటు వ్యయం కూడా తడిసిమోపెడవుతున్నది. పట్టణ ప్రాంతాల్లో కట్టెల కొర త తీవ్రంగా ఉండడం, ధర కూడా అధికమవడంతో ఒక్కో శవ దహనానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల కు పైగా ఖర్చు అవుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయం గా ఎల్పీజీ శవదహన వాటికలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. జనాభా ఎక్కువగా ఉన్న ము న్సిపాలిటీల్లో అమలు చేయతలపెట్టింది. వీటి వల్ల పొగ, దుర్వాసనతో ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు సంప్రదాయ శవదహనాలకు అలవాటు పడ్డ వారికి వైకుంఠధామాల్లో క్రమంగా ఎల్పీజీతో దహన వాటికలపై అవగాహన కల్పించి, విస్తృత స్థాయిలో వినియోగంలోకి తేవాలని భావిస్తున్నారు.
కొటేషన్లు ఆహ్వానించాం..
నిర్మల్లోని మంచిర్యాల చౌరస్తా సమీపంలో గల ప్రధాన వైకుం ఠధామంలో ఎల్పీజీ శవదహ నానికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే కొటేష న్లను ఆహ్వానించాం. ఇక్కడి వైకుంఠధామంలో పట్టణంలో సగానికి పైగా వార్డులకు చెందిన ప్రజలు అంతిమ సంస్కారాల కోసం వస్తుంటారు. ఎల్పీజీ శవదహన వాటికను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్మల్ మున్సిపాలి టీని ఎంపిక చేసింది. త్వరలోనే ఇక్కడ దీనిని ఏర్పా టు చేస్తాం. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
– ఏ.సంపత్కుమార్, మున్సిపల్ కమిషనర్, నిర్మల్.
చాలా మంచి నిర్ణయం..
నిర్మల్లోని అతిపెద్ద వైకుంఠధా మంలో ఎల్పీజీ క్రిమిటోరి యం ఏర్పాటు చేయాలని తలపెట్టడం చాలా మంచి నిర్ణయం. ఈ వైకుంఠధామం పక్కనే మాకు కిరాణం ఉన్నది. కట్టెలను ఉపయోగించి శవదహనం చేసినప్పుడు వచ్చే పొగతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. జనావాసాల మధ్య నుంచి వీటిని తొలగించే అవకాశం లేనందున, ఇలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం శుభ పరిణామం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. ఊరూరా వైకుంఠధామాలు నిర్మించారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా జరుగుతున్నాయి.
– ఆమెడ శ్రీధర్, వ్యాపారి, నిర్మల్.
కట్టెలు దొరకడం లేదు…
అంతిమ సంస్కారాలు చేయా లంటే పేదలకు భారంగా మారింది. పట్టణాల్లో కట్టెలు దొరకడం లేదు. ఉన్న వాటికి అడిగినంత ఇచ్చి కొనాల్సి వస్తున్నది. ఖర్చులు తడిసిమోపెడ వుతున్నయ్. గ్యాస్ ద్వారా దహన కార్యక్రమం చేస్తే ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. కాలం మారుతున్నది. కాలాన్ని బట్టి మనము కూడా మారాలి. కట్టెలతో శవదహనాల వల్ల వచ్చే పొగ వల్ల చుట్టు పక్కల వారికి ఇబ్బంది కలుగుతుంది. ఎల్పీజీ ద్వారా దహనం చేస్తే పొగ రాదంటున్నరు. -గంగారాం, నిర్మల్.