బెజ్జూర్, డిసెంబర్ 6;కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోగల పెంచికల్పేట రేంజ్లోని నందిగాం పాలరాపు గుట్టకు రాబందులు తిరిగి వస్తున్నాయి. అరుదైన ఈ పక్షులకు ఇది స్థావరంగా ఉండగా, మూడేళ్లక్రితం కురిసిన భారీ వర్షాలతో వాటి గూళ్లు చెదిరిపోయాయి. దీంతో మహారాష్ట్రలోని కమలాపూర్ అటవీ ప్రాంతానికి వలస వెళ్లిన పక్షులు తిరిగి తమ అడ్డాకే చేరుకుంటున్నాయి. మళ్లీ ఇక్కడే గూళ్లు కట్టుకొని వాటి సంతతిని పెంచుకునే దిశగా సాగుతున్నాయి. రాబందుల సంరక్షణ కోసం ప్రత్యేక బయోలజిస్ట్ను నియమించారు.
2013లో గుర్తింపు
2013 మార్చిలో పాలరాపు గుట్టపై రాబందుల కదలికలు కనిపించాయి. పెద్దవాగు-ప్రాణహిత నది సంగమం వద్ద సుమారు 300 మీటర్ల ఎత్తులోనున్న పాలరాపు గుట్టపై పొడవు ముక్కు (long billed Vulture) రాబందులు తొమ్మిది కనిపించాయి. దీంతో అధికారులు వాటి సంరక్షణ చర్యలు చేపట్టారు. ఆహారంతో పాటు వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడంతో వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రద్ధ తీసుకున్నారు. ఇతర వన్యప్రాణులు అటు వైపు వెళ్లుండా 2 హెక్టార్లలో చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అంతేగాకుండా ఇద్దరు బర్డు వాచర్లతో పాటు ఒక బయోలజిస్టును నియమించారు. క్రమేనా రాబందుల సంఖ్య 32కు చేరింది. 2019లో భారీ వర్షాల కారణంగా రాబందుల గూళ్లు చెదిరిపోయాయి. పక్కనే ఉన్న మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోని కమలాపూర్కు వెళ్లాయి. మూడేళ్ల తర్వాత పాలరాపు గుట్టకు తిరిగి రావడంతో అటవీ అధికారులు వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పెంచికల్పేట్ రేంజ్ అధికారి వేణుగోపాల్ అవి స్థిరంగా ఇక్కడే ఉండేలా ఆహారపు ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ బయోలజిస్ట్ను నియమించారు. మూడు జతలు తిరిగి వచ్చినట్లు తెలుస్తుండగా, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఒక్కొక్కటిగా మిగతావి వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఆహారంకోసం దట్టమైన అడవిలో వేట
రాబందులు ఒకప్పుడు పశువుల కళేబరాలపై వాలి ఆహారంగా తీసుకునేవి. క్రమేనా పశువుల సహజ మరణాలు పూర్తిగా తగ్గిపోయాయి. వాటికి ఆహారం దొరకడం కష్టంగా మారింది. సుమారు 2 లక్షల ఎకరాలకు పై బడి ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల కళేబరాలను ఆహారంగా తీసుకునేందుకు వేటసాగిస్తుంటాయి. కాగా, రాబందులు పాలరాపు గుట్టపై స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు. పంట పొలాల్లో క్రిమిసంహారక మందులు వాడకుండా రేంజ్ అధికారి వేణుగోపాల్ అవగాహన కల్పిస్తున్నారు.