మందమర్రి, నవంబర్ 29 : మంచిర్యాల జిల్లా పరిధిలోని ఏడు మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను మంగళవారం పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో నిర్మాణంలో ఉన్న సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్ను, వేంకటేశ్వర టెంపుల్ ఏరియాతో పాటు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నర్సరీలను పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. స్థానిక ప్రాణహిత కాలనీ సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నందున నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో రూ.7.20 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఆమె వెంట రోడ్లు, భవనాల శాఖ ఈఈ రాము, మందమర్రి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఏఈ అచ్యుత్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
రెండు పడక గదుల ఇండ్ల పరిశీలన
రామకృష్ణాపూర్, నవంబర్ 29: రామకృష్ణాపూర్ (క్యాతనపల్లి) మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కలెక్టర్ భారతీ హోళికేరి ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీలో 283 రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం పూర్తయి, పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంతంలో మౌళిక సదుపాయాల కల్పనకు నిధులు విడుదలై టెండర్లు పిలిచినట్లు చెప్పారు. త్వరలోనే పనులు పూర్తి చేసి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ రాము, మున్సిపల్ కమిషనర్ జీ వెంకటనారాయణ, ఏఈ అచ్యుత్, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ వసంత్, సిబ్బంది పాల్గొన్నారు.