మంచిర్యాల, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :‘నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు’ అన్నారు పెద్దలు. పిల్లల భవిష్యత్ ఉన్నతంగా, ఆదర్శంగా ఉండడానికి రాష్ట్ర సర్కారు ఎనలేని కృషి చేస్తున్నది. అదే సమయంలో నాణ్యమైన విద్యతోపాటు చిన్నారులు చిన్నతనం నుంచే ఆరోగ్యంగా ఉండేలా కృషి చేస్తున్నది. ప్రధానంగా తక్కువ బరువున్న పిల్లలపై ఫోకస్ పెట్టింది. అంగన్వాడీ స్థాయిలోనే కొద్దిగా తీవ్రలోప పోషణ(ఎంఏఎం), అతి తీవ్రలోప పోషణ(ఎస్ఏఎం)తో బాధపడుతున్న పిల్లలను గుర్తించడం.. వారికి సరైన పోషకాహారం, వైద్యసేవలు అందించడం చేస్తున్నది. “2026 నాటికి పోషకలోపం లేని పిల్లల తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యం”తో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా? లేదా? అనేది వయసుకు తగిన ఎత్తు, బరువు ఆధారంగా అంచనా వేస్తారు. ఈ రెండింటిలో ఏది సరిగా లేకపోయినా వారికి పోషకలోపం ఉన్నట్లే. పిల్లల జబ్బ చుట్టూ కొలత 11.5 సెం.మీ. నుంచి 12.4 సెం.మీ.లు ఉంటే కొద్దిగా తీవ్ర లోప పోషణ(ఎంఏఎం).. 11.4 సెం.మీ. లేదా అంతకంటే తక్కువగా ఉంటే అతి తీవ్ర లోప పోషణ(ఎస్ఏఎం) ఉన్నట్లుగా అధికారులు పేర్కొంటారు. అంగన్వాడీల్లో ఆరేళ్ల వయసు వరకు పిల్లల్లో ఎంఏఎం, ఎస్ఏఎం ఎంత మంది ఉన్నారనేది గుర్తించి, వారికి కావాల్సిన పోషకాహారంతోపాటు వైద్య సేవలు అందిస్తే చిన్న వయసులోనే సమస్యలు అధిగిమించవొచ్చు. కానీ.. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో మన వద్ద ఇప్పటికీ పోషకలోపం అనేది పెద్ద సమస్యగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీల్లో 1,75,887 మంది పిల్లలు ఉండగా అందులో ఎంఏఎం 4304, ఎస్ఏఎం 1221 మంది ఉన్నారు.
పోషకాహారమే పరిష్కారం..
అతి తీవ్రలోప పోషణ(ఎస్ఏఎం), కొద్దిగా తీవ్రలోప పోషణ(ఎంఏఎం) కలిగిన పిల్లలను బాగు చేయడంతో పోషకాహార చికిత్స చాలా కీలకం. ఈ సమస్య ఉన్న పిల్లలకు ఎక్కువ శక్తిని ఇచ్చే పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులతో కూడిన రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలు కోల్పోయిన ఎదుగుదలకు పునరుద్ధరించొచ్చు. ఎంఏఎం పిల్లలు రోజులో ఐదుసార్లు, ఎస్ఏఎం పిల్లలు రోజుకు ఆరుసార్లు బాలామృతం, అరటిపండు, గుడ్డు, పాలు ఆహారంగా ఇస్తారు. ఇలా ఎంఏఎం పిల్లలు ఎనిమిది వారాలు, ఎస్ఏఎం పిల్లలు 16 వారాల్లో కోలుకోవాల్సి ఉంటుంది. అప్పటికీ సమస్యకు పరిష్కారం లభించకపోతే ఆ పిల్లలను ఎన్ఆర్సీ(న్యూట్రీషన్ రీహాబిలిటేషన్ సెంటర్)కు పంపిస్తారు. అక్కడ వైద్య పరమైన సేవలతోపాటు పోషకాహారం ఇస్తూ పిల్లలు లోపాన్ని అధిగమించేలా చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పిల్లల కోసం ఉట్నూరులో ఈ సెంటర్ ఉంది. అతి త్వరలోనే మంచిర్యాల గవర్నమెంట్ ఆస్పత్రికి అనుసంధానంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎస్ఏఎం, ఎంఏఎం పిల్లల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు, గ్రామాల ప్రజాప్రతినిధులకు ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు.
అంగన్వాడీ కార్యకర్త చేయాల్సిన పని..
ప్రతినెలా వివరాలు నమోదు చేస్తున్నాం..
ప్రతినెలా పిల్లల ఎత్తు, బరువు చూసి ఆ వివరాలు నమోదు చేస్తున్నాం. ఎస్ఏఎం, ఎంఏఎం పిల్లలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. వారికి సరైన పోషకాహారం అందేలా చూస్తున్నాం. అంగన్వాడీకి రాకపోతే ఇంటికి వెళ్లి మరీ తీసుకొస్తున్నాం. ఇంట్లో సరైన ఆహారం పెడుతున్నారా? లేదా? నిత్యం ఆరా తీస్తున్నాం. మా కేంద్రంలో కొద్ది మంది పిల్లల్లో మాత్రమే ఈ సమస్య ఉంది.
– అరుణ, అంగన్వాడీ టీచర్.
ఏడాదికి మూడు శాతం తగ్గించాలనేది లక్ష్యం
ఎస్ఏఎం, ఎంఏఎం కేసులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు జిల్లాలో పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నాం. ఏడాదికి మూడు శాతం చొప్పున కేసులను తగ్గిస్తూ 2026 నాటికి సున్నా ఎస్ఏఎం, ఎంఏఎం పిల్లలు ఉండేలా చేస్తాం. అంగన్వాడీ కార్యకర్తలతోపాటు ఆశావర్కర్లు, గ్రామంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాం. కేసులు తగ్గించడంలో అంగన్వాడీతోపాటు మిగిలిన వారికి అంతే బాధ్యత ఉంటుంది. ఈ విషయంలో అందరం కలిసి పని చేస్తూ గడిచిన రెండు నెలల్లోనే ఎంఏఎస్ కేసులను సగానికిపైగా తగ్గించాం. రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన ఫలితాలను సాధిస్తాం.
– చిన్నయ్య, డీడబ్ల్యూవో, మంచిర్యాల