ఎదులాపురం,నవంబర్28: అన్ని ఠాణాల్లో ప్రత్యేక మహిళ సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని, మహిళా హెల్ప్ డెస్క్పై నమ్మకం పెంపొందించేలా విధులను నిర్వర్తించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మహిళా హెల్ప్డెస్క్లకు కేటాయించిన 200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదిలాబాద్లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో రెండు రోజుల పాటు శిక్షణను ఏర్పాటు చేశారు. మహిళా హెల్ప్ డెస్క్తో కలిగే ప్రయోజనాలు, బాధితులతో వ్యవహరించాల్సిన పద్ధతులు, ఇతర శాఖలతొ సమన్వయం తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎస్పీ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా మహిళా సిబ్బంది ద్వారా ఈ వుమెన్ హెల్ప్ డెస్క్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మహిళలు మహిళల వద్దకే వచ్చి తమ సమస్యలు, ఇబ్బందులను విన్నవించేలా ఈ డెస్క్ పనిచేస్తుందని చెప్పారు. బాధితుల సమస్యను సమగ్రంగా తెలుసుకొని, సత్వర న్యాయం చేకూరేలా ఈ మహిళా హెల్ప్ డెస్క్లు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో పనిచేస్తాయని వివరించారు. ఇందులో డీసీపీవోయూనిట్, సీడబ్ల్యూసీ, జువైనల్ జస్టిస్ బోర్డ్, డీడబ్ల్యూవో, ఐసీడీఎస్, డీఎల్ఎస్ఏ, విద్య, వైద్యం, కార్మిక శాఖ, చిల్డ్రన్ హోమ్, చైల్డ్లైన్ తదితర శాఖల సమన్వయంతో పనిచేస్తాయని వెల్లడించారు. మహిళలు నిరభ్యంతరంగా ఎటువంటి భయాందోళనలు లేకుండా ఠాణాల్లో మహిళా హెల్ప్ డెస్క్లను వినియోగించుకోవాలని కోరారు. నేరస్తులకు శిక్ష పడినప్పుడే నేరాల సంఖ్య తగ్గముఖం పడుతాయని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సీ సమయ్ జాన్రావు, వుమెన్ సేఫ్టీ అడిషనల్ ఎస్పీ జీ రాజారత్నం, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాజేంద్రప్రసాద్, సీఐ మల్లేశ్, ఆర్ఐ సీఐ వేణు, శిక్షణ సిబ్బంది పాల్గొన్నారు.