నిర్మల్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ):మారుమూల పల్లెలకు రహదారులను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అడ్డు పడుతున్నది. పర్యావరణం పేరిట అనుమతులు ఇవ్వక పోవడంతో, అనేక గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించలేని పరిస్థితి నెలకొన్నది. నిర్మల్ జిల్లాలో పెద్ద ఎత్తున రహదారులకు రాష్ట్రం నిధులు మంజూరు చేసినా, కేంద్రం కొర్రీలు పెడుతూ అడ్డు తగులుతుండడం విమర్శలకు తావిస్తున్నది. దీంతో సుమారు రూ. 23. 20 కోట్ల విలువైన పనులు నిలిచిపోగా, పల్లెజనం ఇబ్బందులు పడుతున్నది.
నిర్మల్ జిల్లాలో చాలా ఏళ్ల నుంచి రోడ్ల నిర్మాణాలకు కేంద్ర అటవీశాఖ అనుమతులను నిరాకరిస్తున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులన్నీ వృథాగా పోతున్నాయి. గతంలో కూడా నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు నిర్మించ తలపెట్టిన నేషనల్ హైవేకు కేంద్ర అటవీశాఖ ఆటంకాలు సృష్టించింది. దీంతో పాటు అడెల్లి నుంచి బోథ్ వరకు నిర్మిస్తున్న రోడ్డుకు కూడా గతంలో అనుమతుల విషయంలో ఏళ్లుగా పెండింగ్లో పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ రహదారి సౌకర్యాన్ని కల్పించాలనే సదుద్దేశంతో ఎప్పటికప్పుడు నిధులు కూడా మంజూ రు చేస్తున్నది. సంబంధిత పంచాయతీ రాజ్, ఐటీడీఏ అధికారులు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపుతుండడంతో వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, అవసరమైన మేరకు నిధులను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులను వెలువరిస్తున్నది. ఇలా ఓ వైపు పరిపాలనా పరమైన అనుమతులు, అలాగే మరో వైపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం పర్యావరణం పేరిట ఆటంకాలు సృష్టించి అడ్డు తగులుతుండడం విమర్శలకు తావిస్తున్నది. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ, ఐటీడీఏ పరిధిలో నిర్మిస్తున్న రోడ్లకు అటవీ అనుమతులు నిలిచిపోవడంతో అనేక గ్రామాలు రోడ్డు సదుపాయానికి దూరమవుతున్నాయి. ఇప్పటికీ కాలిబాటనే వారికి శరణ్యమవుతోంది.
నిలిచిపోయిన పనులు…
జిల్లావ్యాప్తంగా పంచాయతీరాజ్ పరిధిలో దాదాపు రూ. 20 కోట్ల విలువైన పనులు నిలిచిపోగా, ఐటీడీఏ పరిధిలో రూ. 3.20 కోట్ల పనులు పెండింగ్లో పడ్డాయి. కడెం మండలం ధర్మాజీపేట నుంచి లక్ష్మీసాగర్ వెళ్లే రోడ్డుకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వడం లేదు. దాదాపు కిలోమీటర్ పొడవుతో ఉన్న ఈ రోడ్డు పనులు అటవీ అనుమతులు రాని కారణంగా నిలిచిపోయాయి. అలాగే కడెం మండలం మాసాయిపేట నుంచి అక్కకొండ ఆలయానికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వడం లేదు. దాదాపు 1.6 కిలో మీటర్ల మేర ఈ రోడ్డు పనులు నిలిచిపోయాయి. అలాగే పీఎంజీఎస్వై కింద పెంబి మండలం రాసిమెట్ల నుంచి కోరకంటి గ్రామం వరకు 6 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన రోడ్డుకు సైతం కేంద్ర అటవీ శాఖ ఆటంకాలు కలిగిస్తున్నది. దీంతో పాటు ఖానాపూర్ మండలం ఎర్వచింతల్ గ్రామం నుంచి దత్తోజీపేట్ వరకు 2 కిలోమీటర్ల పొడవుతో నిర్మించ తలపెట్టిన రోడ్డుకు కూడా కేంద్ర అటవీ శాఖ బ్రేక్ వేసింది. అలాగే కడెం మండలంలో ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి అల్లంపెల్లి వరకు 9 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాల్సిన ఈ ముఖ్యమైన రోడ్డుకు సైతం కేంద్ర అటవీశాఖ అనుమతులను నిరాకరిస్తుండడం ఈ ప్రాంత ప్రజల ఆగ్రహానికి కారణమవుతున్నది. దీంతో పాటు పెంబి మండలంలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి కొసగుట్ట వరకు గల రోడ్డుకు సైతం అనుమతులు లభించడం లేదు. ఇప్పటివరకు కేవలం అడెల్లి నుంచి బోథ్ వరకు నిర్మిస్తున్న రోడ్డుకు మాత్రమే కేంద్ర అటవీశాఖ అనుమతులు జారీ చేసింది.
ఐటీడీఏ రోడ్లదీ అదే పరిస్థితి…
ఐటీడీఏ పరిధిలో జిల్లాలో నిర్మిస్తున్న రోడ్లకు సంబంధించి కూడా కేంద్రం అటవీ అనుమతులు ఇవ్వడం లేదు. కడెం మం డలం పాండవాపూర్ నుంచి డ్యాంగూడా వరకు వెళ్లే రోడ్డుకు అనుమతులు రాక పనులు నిలిచిపోయాయి. 1.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు అడవి మార్గం గుండా వెళ్తున్నది. రూ. కోటీ 20లక్షలతో చేపట్టిన ఈ రోడ్డు పనులు ముందుకు సాగక పోవడంతో ఆయా గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పెంబి మండలంలో రాయదరి గ్రామం నుంచి గోధుమల్ గ్రామానికి వెళ్లే రోడ్డులో కిలోమీటరు మేర పనులు నిలిచి పోయాయి. ఈ రోడ్డుకు ప్రభుత్వం రూ.2కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇలా అనేక మారుమూల గ్రామాలు, గూడెంలు, తండాలకు రోడ్డు రవాణా సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తే, అడ్డుపడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది ఆరు గ్రామాల సమస్య…
మా గ్రామాలు, తండాలకు చెందిన ప్రజలు మండల కేంద్రమైన పెంబికి రావాలంటే ఇదే ప్రధాన రోడ్డు. రాసిమెట్ల నుంచి కోరకంటి వరకు కొత్తగా రోడ్డును నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అధికారులు చెప్పారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వక పోవడం వల్ల పనులు జరగడం లేదంటున్నారు. ఈ రోడ్డు పూర్తయితే కొరకంటితో పాటు అంకెన, రాయదారి, పసుపుల, పోచంపెల్లి, కర్ణంలొద్ది తదితర గ్రామాలతో పాటు పలు తండాలకు చెందిన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
–సూర్యభాను, సర్పంచ్, కోరకంటి, పెంబి మండలం
మూడేళ్లుగా ఎదురు చూస్తున్నాం
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా నిర్మిస్తున్న రోడ్లకు సంబంధించి కడెం, ఖానాపూర్, పెంబి మండలాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అటవీ అనుమతులు రావాల్సి ఉంది. మూడేళ్లుగా అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే పలుమార్లు అనుమతుల కోసం ప్రభుత్వానికి విన్నవించాం. దాదాపు రూ.20 కోట్లతో చేపట్టాల్సిన పనులు నిలిచి పోయాయి. అటవీ ప్రాంతం లేని చోట రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. కేంద్ర అనుమతులు రాగానే మిగిలిపోయిన పనులను చేపడుతాం.
–శంకరయ్య, ఈఈ, పంచాయతీరాజ్శాఖ, నిర్మల్