ఆదిలాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం సక్రమంగా లేక అడవిబిడ్డలు అవస్థలు పడుతున్నారు. వానకాలంలో మోస్తరు వార్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లడం, రోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. రైతులు తమ పొలాలకు వెళ్లలేని పరిస్థితి. వానకాలం వ్యాధుల నివారణలో భాగంగా వైద్యబృందాలు కూడా మోకాలు లోతు బురద, వాగులు దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. గర్భిణులు ప్రసవాలకు దవాఖానలకు పోవాలంటే అంబులెన్స్లు, ఇతర వాహనాలు రావడానికి అవకాశం లేదు. స్థానికులు మంచాలపై గర్భిణులను ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వస్తున్నది. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో భాగంగా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ గూడేలు, గిరిజన తండాలకు రవాణా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా మట్టి రోడ్లు ఉన్న గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లను నిర్మించడానికి అవసరమైన నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.233.18 కోట్లతో 278 రోడ్ల పనులను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. గిరిజన గ్రామాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా బీటీ రోడ్లు, నిధులు మంజూరుకావడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏండ్ల గోస తీరనుంది..
మా గ్రామానికి చెందిన రైతులు భూములు చిట్యాలబోరి రోడ్డు వెంబడి ఉన్నాయి. మట్టిరోడ్డు మీద వ్యవసాయ పనుల కోసం రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోతాం. వానకాలంలో చిట్యాలబోరి రోడ్డు మీద బురద ఎక్కువగా ఉంటుంది. వానలు బాగా పడితే వారం రోజుల దాకా చేలకు పోయే పరిస్థితి ఉండదు. దీంతో కలుపుతీయడం, మందులు చల్లడం కష్టమవుతున్నది. అటవీ జంతువులు కూడా పంటను పాడు చేస్తాయి. రోడ్డు లేని కారణంగా మా గ్రామ రైతులు పంటలు నష్టపోవాల్సి వస్తున్నది. బీటీ రోడ్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం కొత్తగా రోడ్డు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. రహదారి నిర్మాణంతో మాకు వానకాలం తిప్పలు తప్పుతాయి.
– అత్రం తానాజీ, కచ్కంటి, ఆదిలాబాద్ రూరల్ మండలం
ఎడ్లబండి కూడా నడవదు..
నేను వానకాలంలో నాలుగు ఎకరాల్లో పత్తి, సోయా వేస్తాను. ఇంటి నుంచి కిలోమీటరు దూరంలో మా చేను ఉంటుంది. వానకాలంలో రోజు చేనుకు పోతే తప్పా దిగుబడి సరిగా ఉండదు. వానకాలంలో మట్టిరోడ్డుపై బురద బాగా ఉంటుంది. ఎడ్లబండిపై చేలకు పోదామంటే అవకాశం ఉండదు. దీంతో పంటలు నష్టపోవాల్సి వస్తున్నది. చిట్యాలబోరి, చింతగూడ, భూర్నూర్, కొత్తూర్ గ్రామాల ప్రజలు ఆదిలాబాద్కు వానకాలం వచ్చే పరిస్థితి ఉండదు. సర్కారు బీటీ రోడ్డు మంజూరు చేయడంతో మా సమస్యలు తీరనున్నాయి.
– వెంకట్రావ్, రైతు, కచ్కంటి, ఆదిలాబాద్ రూరల్ మండలం
త్వరలో టెండర్లను ఆహ్వానిస్తాం..
గిరిజన గ్రామాలకు ప్రభుత్వం భారీ సంఖ్యలో రోడ్లను మంజూరు చేసింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగనుంది. బీటీ రోడ్ల నిర్మాణంతో వానకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించవచ్చు. మంజూరైన రోడ్లకు సంబంధించి వారం రోజుల్లో సర్వే చేసి అంచనాలు గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణ ఇంజినీర్కు పంపడం జరుగుతుంది. టెక్నికల్ మంజూరు తర్వాత టెండర్ పిలిచి త్వరలో పనులు ప్రారంభిస్తాం.
– రాథోడ్ భీంరావు, ఈఈ, గిరిజన సంక్షేమ శాఖ