ఆదిలాబాద్, నవంబర్ 11 ( నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ పట్టణంలో రైల్వే వంతెన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రాష్ట్ర సర్కారు రూ.57.71 కోట్లను మంజూరు చేసింది. రైళ్ల రాకపోకల సమయంలో గేట్లు వేయడంతో సమయం వృథా అవుతుండగా, వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. దీంతో ప్రయాణికులు, పలు కాలనీల వాసుల ఇక్కట్లను గుర్తించిన ప్రభుత్వం, బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నది. ఇప్పటికే వంతెన టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని అధికార యంత్రాంగం చెబుతున్నది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారధి పనులకు మరో ముందడుగు పడగా, పట్టణవాసుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
ఆదిలాబాద్ పట్టణంతో పాటు తాంసి, తలమడుగు మండలాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం జిల్లాకేంద్రంలోకి రావాలంటే రైల్వే ట్రాక్పై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. తాంసి బస్టాండ్తో పాటు స్పిన్నింగ్ మిల్ ప్రాంతంలో రైల్వే ట్రాక్లు ఉండడంతో రాకపోకల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పట్టణంలోని ఖుర్షీద్నగర్, సందరయ్యనగర్, గాంధీనగర్, తాటిగూడ రణదివేనగర్, హమాలీవాడ, భాగ్యనగర్, క్రాంతినగర్, జైజవాన్నగర్ నుంచి వచ్చే వాహనదారులు రైళ్లువచ్చే సమయంలో గేట్లు మూసివేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు రైతులు తమ పంటలను అమ్ముకునేందుకు పోవాలంటే తాంసి బస్టాండ్ వద్ద రైల్వే ట్రాక్ దాటి పోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పత్తి కొనుగోళ్లు జరుగుతుండడంతో రోజూ వందలాది వాహనాల్లో రైతులు పంట విక్రయానికి మార్కెట్కు తీసుకవస్తారు. తాంసి బస్టాండ్ వద్ద నుంచి మహారాష్ట్రకు పోయే అంతర్రాష్ట్ర రహదారి ఉండడంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రైల్వే గేట్ పడడంతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. దీంతో రైల్వే వంతెన నిర్మాణం జరపాలని పట్టణ వాసులు ఏళ్లుగా కోరుతున్నారు.
రూ.57.71 కోట్లు మంజూరు
రైల్వే బ్రిడ్జి నిర్మించాలని పట్టణప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న వంతెన నిర్మాణం కోసం ప్రత్యేక కృషి చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.57.71 కోట్లు మంజూరు చేసింది. తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. పట్టణ ప్రజలు వ్యవసాయ మార్కెట్యార్డుకు పోయేందుకు ఈ వంతెన ఉపయోగపడుతుంది. నిర్మాణం తర్వాత కింది నుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతాయి. స్పిన్నింగ్ మిల్ ప్రాంతంలో రైల్వే ట్రాక్పై వంతెన నిర్మిస్తారు. కలెక్టర్ చౌక్, ఎల్ఐసీ కార్యాలయం నుంచి వాహనాలు తాంసి, తలమడుగు మండలాలతో పాటు పట్టణంలోని పలు కాలనీలు, మార్కెట్యార్డుకు పోవడానికి ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది. వంతెన నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లు పూర్తయినట్లు రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు. నిర్మాణంలో భాగంగా విద్యుత్ స్తంభాలను తొలగించి త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు.