కెరమెరి, నవంబర్ 9 : డబుల్ బెడ్ రూం ఇండ్లను శరవేగంగా పూర్తి చేయాలని, వెంటనే బిల్లులు అందేలా చూస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. బుధవారం జోడేఘాట్ను సందర్శించిన ఆయన, భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మ్యూజియం, మినీ బృహత్ పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఏపుగా పెరిగిన మొక్కల కింద పర్యాటకులు కూర్చునేలా బెంచ్లు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ అధికారులకు సూచించారు.
నాటిన మొక్కలు వాడిపోకుండా, గ్రామస్తులకు నీటి కొరత రాకుండా అదనంగా రెండు బోర్వెల్స్ వేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆశ్రమ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని, గుణాత్మకమైన విద్యను అందించాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. శివగూడలో నిర్మించిన మోడల్ గృహాన్ని పరిశీలించి.. మిగతా ఇండ్లు సైతం త్వరగా నిర్మించాలని సూచించారు. వచ్చే జనవరిలోగా పనులు పూర్తి చేసి గృహ ప్రవేశం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీఈ నిరంజన్, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ఎంపీవో సుదర్శన్, ఏపీవో మల్లయ్య, ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులు, ఉపాధ్యాయుడు ఆత్రం మోతీరాం, సర్పంచ్ సోనీబాయి తదితరులు పాల్గొన్నారు.