స్వరాష్ట్రంలో నదీ జలాల వినియోగంపై దృష్టి పెట్టిన సర్కారు, అనువైనచోట్ల ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములను సాగులోకి తెచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. అందులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీర్దండి గ్రామం.. అటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడేగావ్ గ్రామం మధ్య వార్ధా నదిపై బరాజ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.1000 కోట్లతో 5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించవచ్చని అంచనా వేసిన వ్యాప్కోస్ సంస్థ, ఇందుకు సంబంధించిన డీపీఆర్ను ఇటీవల ప్రభుత్వానికి అందించింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించే అవకాశముండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 11 మండల్లాల్లో సుమారు 2 లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కౌటాల మండలం వీర్దండి గ్రామం.. అటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడేగావ్ గ్రామం మధ్యన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా నదిపై బరాజ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ బరాజ్ ద్వారా సిర్పూర్ నియోజకవర్గంలో 88,919 ఎకరాలు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 19,556 ఎకరాలు, బెల్లంపల్లి నియోజకవర్గంలో 89,935 ఎకరాలకు సాగునీరు అందనుంది.
వార్ధానదిపై బరాజ్ నిర్మాణంతో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 11 మండలాల్లో సుమారు 2 లక్ష ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్, చింతలమానెపల్లి, కౌటాల, సిర్పూర్-టీ, దహెగాం మండలాలతో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బెన, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, తాండూర్ మండలాల్లోని భూములకు సాగునీరు అందనుంది. 653 మీటర్ల పొడవు, 12 మీటర్ల ఎత్తు.. వార్ధానదిపై బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి గత ఫిబ్రవరిలో సర్వేలు చేపట్టిన అధికారులు తొమ్మిది నెలల్లోనే డీపీఆర్ (డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) తయారు చేశారు. 5 టీఎంసీల సామర్థ్యంతో రూ.1,000 కోట్లతో వార్ధా బరాజ్ను నిర్మించవచ్చునని అంచనా వేశారు.
ఇందుకు సంబంధించిన డీపీఆర్ను వ్యాప్కోస్ సంస్థ ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. కౌటాల మండలం వీర్దండి గ్రామం.. అటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడేగావ్ గ్రామం మధ్యన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధానదిపై 653 మీటర్ల పొడవు, 12 మీటర్ల ఎత్తుతో 27 గేట్లతో బరాజ్ నిర్మించనున్నారు. బ్యారేజ్ నుంచి ప్రధాన కాలువల వద్ద మూడు పంపు హౌ స్లు (లిప్ట్లు) ఏర్పాటు చేయనున్నారు. వార్ధా బరాజ్ వద్ద నుంచి 11 కిలో మీటర్ల దూరంలో మొదటి పంపు హౌస్ ఉంటుంది. దీని ద్వారా అక్కడి నుంచి 55 కిలోమీటర్ల దూరంలో మరో పంపు హౌస్ ఏర్పాటు చేయనున్నారు. దీని నుంచి మూడో పంపు హౌస్కు నీరు చేరవేస్తారు.
మొదటి పంపు హౌస్ నుంచి కాలువల ద్వారా కౌటాల మండలం కనికి చెరువులోకి పంపింగ్ చేస్తారు. రెండో పంపు హౌస్ నుంచి తాండూర్ మండలం అచలాపూర్ చెరువులోకి నీటిని తరలిస్తారు. అచ్చెల్లి చెరువు నుంచి రెబ్బెన మండలం రోల్లపాడు చెరువు, మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం పోచంపల్లి చెరువుల్లోకి నీటిని తరలిస్తారు. చెరువుల నుంచి కాలువల ద్వారా వ్యవసాయ భూములకు నీరు సరఫరా చేస్తారు.
వార్ధా నదిపై నిర్మించనున్న బరాజ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల రైతులకు వరంలా మారనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవేళ్ల సుజల స్రవంతి పేరిట ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. అయితే ప్రాజెక్టు నిర్మించకుండానే కాలువల తవ్వకం చేపట్టింది. 7 మీట్లర్ల వెడల్పు, 12 మీటర్ల లోతుతో 75 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తిచేసింది. కానీ.. బరాజ్ నిర్మాణం పూర్తికాకపోవడంతో కాలువలు నిరూపయోగంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా వార్ధా నదిపై నిర్మించనున్న బరాజ్తో ఈ కెనాల్లు వినియోగంలోకి రానున్నాయి. వార్ధానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న బరాజ్ నిర్మాణాన్ని ఎలాంటి అటవీ చిక్కులు రాకుండా, ముంపు సమస్యలు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు.