ఇచ్చోడ, అక్టోబర్ 30 : గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి, ప్రజలకు ఉపాధి కల్పించడమే ఉపాధి హామీ ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24లో చేపట్టే పనుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం మండలంలోని ప్రతి గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వస్తున్నారు. గ్రామస్తులు తమకు అవసరమైన పనులు ఎంపిక చేసుకోవచ్చు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏటా పనులను గుర్తించడం ఆనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వం 56 రకాల పనులను గుర్తించి ప్రణాళికలు రూపొందించి వాటికి నిధులు విడుదల చేస్తున్నది.
గ్రామసభనే కీలకం..
మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో ఇటీవల ఉపాధి హామీ గ్రామసభ నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏఏ పనులు చేయాలో చర్చించారు. సర్పంచ్, ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు చర్చలో పాల్గొని పనులు గుర్తించారు.
పనుల గుర్తింపునకు గ్రామసభలు..
ఉపాధి హామీ నిధులు దక్కాలంటే గ్రామసభలో గుర్తించిన పనులే కీలకం కానున్నాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న సభల్లో కూలీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతున్నారు. గ్రామాభివృద్ధి, వ్యక్తిగత పనులతో పాటు రైతులు తమ పంట చేలల్లో అవసరమైన వాటిని గుర్తించవచ్చు. గ్రామసభల ఆమోదం లభించిన వెంటనే పనులు చేపట్టే వీలుంటుంది. ఒకవేళ సభలకు హాజరు కాకుండా, వివరాలు నమోదు చేయకపోతే మరో ఏడాది పాటు నిరీక్షించాల్సి ఉంటుంది.
వివిధ రకాల పనులు..
ఉపాధి హామీ పథకం కింద 56 రకాల పనులు చేపట్టవచ్చని ఆధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా పంట చేలలో నీటి కుంటలు, కందకాల తవ్వకం, పూడికతీత, పశువుల పాకలు, పంట కల్లాల నిర్మాణం, పశుగ్రాసం పెంపకం, పండ్ల తోటలు, గట్లపై టేకు చెట్ల పెంపకం, వర్షపు నీటి మళ్లింపు కాలువలు, బంజరు భూములను సాగుకు యోగ్యంగా మార్చడం, రహదారులు, మట్టిరోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి చేపట్టనున్నారు. నర్సరీల నిర్వహణ, హరితహారం మొక్కల సంరక్షణ, పంచాయతీ, అంగన్వాడీ, భవనాల నిర్వహణ, చెరువుల నిర్మాణం, పూడికతీత పనులను గ్రామసభలో ఆమోదించవచ్చు.
గ్రామ సభల ఆమోదంతోనే..
ఇప్పటికే జిల్లా ప్రతి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ గ్రామసభలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ఆమోదించిన పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. సభల్లో తీర్మానించిన పనులే చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈజీఎస్ ద్వారా కేటాయించిన నిధులన్నీ వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నాం. జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి పని కల్పించేలా గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు అవగాహన అవగాహన కల్పిస్తున్నాం.
– ఎస్.కిషన్ డీఆర్టీవో ఆదిలాబాద్ జిల్లా
ప్రణాళికలు రూపొందిస్తాం..
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నాం. ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజులు పని కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గ్రామసభలు ద్వారా రైతులకు ఉపయోపడే పనులను గుర్తిస్తున్నారు. పనులు వ్యయ నిర్ధారించి ప్రణాళికలు రూపొందిస్తాం. నవంబర్ చివరి వరకు ఉపాధి హామీ గ్రామసభలు పూర్తి చేసి జిల్లా ఉపాధి హామీ అధికారులను నివేదిక పంపిస్తాం. నూతనంగా వచ్చిన మార్పులను గుర్తించి కూలీలకు వివరిస్తాం.
– వీ రాంప్రసాద్, ఎంపీడీవో, ఇచ్చోడ
అవగాహన కల్పిస్తున్నారు..
ఉపాధి హామీ అధికారులు, పాలక వర్గం సభ్యులు గ్రామపంచాయతీలో సభ నిర్వహించి 2023-24 సంవత్సరంలో చేపట్టే పనులను గుర్తించారు. వంద రోజుల్లో ఉపాధి హామీ ద్వారా కూలీలు చేసే పనులను గుర్తించి చర్చించాం. ముఖ్యంగా గ్రామంలో ఏ పనులు చేపట్టాలి? రైతులకు ఉపయోగపడే పనుల వివరాలను అధికారులు రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు. ఉదయం, మధ్యాహ్నం హాజరును కేంద్ర ప్రభుత్వం తొలగించాలి.
– రాధాబాయి, ఉపాధి కూలీ, సిరికొండ