దస్తురాబాద్,అక్టోబర్30 : మండలంలో సాగు చేసిన వరి పంట ఆశాజనకంగా ఉంది. గతంలో కన్నా దిగుబడి పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
వానకాలం సీజన్ ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారీగా వరద రావడంతో కడెం ప్రాజెక్ట్ తెగిపోతుందేమోననే ఆందోళన మండల రైతుల్లో వ్యక్తమైంది. ప్రమాదస్థాయిలో వచ్చిన వరదను తట్టుకొని కడెం ప్రాజెక్ట్ నిలబడింది. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అధికారులు సత్వరమే గేట్లకు మరమ్మతు చేయించారు. ఈ సమయంలో ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్కి వెళ్లింది. కడెం ప్రాజెక్ట్ పరిధిలోని మండల రైతులు వానకాలం సాగుపై ఆశలు వదులుకున్నారు. మళ్లీ భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చి చేరింది.కానీ పంటల సాగు రెండు నెలలు వెనుకబడింది. సమృద్ధిగా వర్షాలు కురవడం, ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ ద్వారా నీటిని విడుదల చేయడంతో రైతులు వరి సాగు చేశారు.
మండలంలో కడెం ప్రాజెక్టుతో పాటు బోర్లు, బావుల కింద మొత్తం 7681 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. వర్షాలు సకాలంలో కురవడం, వాతావరణం అనుకూలించడంతో తెగుళ్లు పెద్దగా కనిపించలేదు. దీంతో వరి సాగు చేసిన రైతులకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున మొత్తం 192025 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉంది. కొన్ని చోట్ల ముందు సాగు చేసిన వరి కోత దశకు చేరుకుంది. వరి కోతలు సైతం ప్రారంభించే అవకాశం ఉంది.
దిగుబడిపై ఆశలు..
వరి పంటకు అనుకూలంగా ఉన్నా నేపథ్యంలో దిగుబడి పెరుగుతాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. గత యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలుపై కొంత సందిగ్ధత ఏర్పడినా, రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.దీంతో ప్రభుత్వమే వడ్లు కొంటుందనే భరోసా ఏర్పడడంతో రైతులు ధైర్యంగా వరి సాగు చేశారు. అన్ని అనుకూలించడంతో పంట ఏపుగా పెరిగింది. కొంత వరకు తెగుళ్ల సమస్య ఉన్నా నష్టపోయే పరిస్థితులు ఎదురవలేదు. తెగుళ్లు వచ్చిన పంటలో సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకుంటే దిగుబడి పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
మెళకువలు పాటించాలి
రైతులు వరి సాగు లో మెళుకువలు పాటించినప్పుడే దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అధికారుల సలహాలు,సూచనల మేరకు వరి సాగు చేస్తే దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. వరి పంట ఆలస్యంగా వేయడం వలన కొన్ని తెగుళ్లు ఆశించాయి. వీటి వల్ల పెద్దగా నష్టం లేదు. తెగుళ్లు వచ్చిన పంటకు సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకుంటే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది.
జాడి తిరుపతి, ఏఈవో దస్తురాబాద్ క్లస్టర్