సారంగాపూర్, అక్టోబర్ 28 : ప్రభుత్వాలు వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాయని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని చించోలి(బీ) మహిళా ప్రాంగణంలో శుక్రవారం సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విస్తరణ సేవల ప్యాకేజీ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య రంగానికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నదన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ప్రజలకు మరింత చేరువగా, నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా మాతాశిశు సంరక్షణ, మానసిక, కుటుంబ నియంత్రణ, వ్యాధి నిరోధక టీకాలు, వివిధ వ్యాధులకు చికిత్సలతో పాటు పాలియేటివ్ కేర్, వృద్ధుల సంరక్షణ, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సేవలు, కంటి, దంత సేవలు కూడా అందించాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ విస్తరించిన సేవలపై ఆశ కార్యకర్తలకు మరింత అవగాహన పెంచడాని కి ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆశ కార్యకర్తలందరూ ఈ శిక్షణను ఉపయోగించుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజల్లో సాధారణ ప్రసవాలపై అవగాహన కలిగించి ఆపరేషన్ ప్రసవాలను తగ్గించాలని పేర్కొన్నారు.
మండలంలోని గోపాల్పేట్, చించోలి(బీ) గ్రామాల్లో ‘మన ఊరు-మనబడి’ పథకం కింద ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చేపడుతున్న పనులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం అందించాలన్నారు. క్లాస్ రూముల్లోకి వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధాలు రాబట్టారు. ‘మన ఊరు-మనబడి’ పథకంతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధన్రాజ్, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, కార్యనిర్వహణ అధికారులు డాక్టర్ నిఖిలారాణి, డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, మహిళా ప్రాంగణం ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, డీసీహెచ్ఎన్వో సాయన్న, తహసీల్దార్ సంతోష్రెడ్డి, ఎంపీడీవో సరోజారెడ్డి, సర్పంచ్ లక్ష్మి, శిక్షకులు సరస్వతి, లక్ష్మి, దుర్గాభవాని, జయలలిత, విమల, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మామడ, అక్టోబర్ 28 : ‘మన ఊరు-మన బడి’ పనులను వేగిరం చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని కమల్కోట్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా జరిగిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్రెడ్డి, ఎంపీడీవో మల్లేశం, ఎంపీవో గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణచాంద, అక్టోబర్ 28 : మండలంలోని కనకాపూర్ ప్రాథమిక పాఠశాలలో చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ పనులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు గదులు, ప్రహరీ, రిపేరింగ్ తదితర పనులను పరిశీలించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేయాలని సూచించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు అందిస్తుండడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఆర్డీవో తుకారాం, తహసీల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో శేఖర్, సర్పంచ్ సుక్కు ముత్తవ్వ పాల్గొన్నారు.