బోథ్, అక్టోబర్ 28 : బోథ్ మండలంలో వానకాలం పంట కింద 13,250 ఎకరాల్లో రైతులు సోయా పంటను సాగు చేశారు. జూన్ రెండు, మూడో వారంలో వేసిన పంట ప్రస్తుతం కోత దశకు చేరుకోవడంతో రైతులు కోతలు ముమ్మరం చేశారు. కూలీల సాయంతో సోయా కోయిస్తున్నారు. మరికొంతమంది హార్వెస్టర్తో పంటను నేరుగా కటింగ్ చేయిస్తున్నారు. కూలీలతో పంట కోయించిన రైతులు కుప్పలుగా వేసి హార్వెస్టర్, ట్రాక్టర్ హల్లర్లతో నూర్పిడి చేయిస్తున్నారు. తేమ శాతం 8 కంటే ఎక్కువగా ప్రస్తుతం చూయిస్తుండడంతో పొలాల్లోనే సోయాను ఎండబెడుతున్నారు. తేమ శాతం తగ్గాక బస్తాల్లో నిండి ఇళ్లకు, మార్కెట్లకు తరలిస్తున్నారు. సోయా కోతలు మొదలుకావడంతో అటు కూలీలు, ఇటు రైతులకు చేతినిండా పని ఉండడంతో పొలాల్లోనే బిజీబిజీగా కనిపిస్తున్నారు. గత పది రోజులుగా వాతావరణం పొడిగా ఉండడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సోయా కోతలు పూర్తయిన వారు దుక్కులు దున్నడం పనులు ప్రారంభించారు. మార్కెట్లో క్వింటాల్కు రూ 4,900 నుంచి రూ. 5,300 వరకు (ప్రస్తుతం) పలుకుతుండడంతో రైతులు అమ్మకానికి ఆసక్తి చూపుతున్నారు.
పది ఎకరాల్లో సోయా సాగు చేశా. మొదట్లో కురిసిన వర్షాల మూలంగా పంట పండుతుందో లేదోనే భయం ఉండేది. వర్షాలు తగ్గడంతో పంట దిగుబడి బాగానే వచ్చింది. ఎకరానికి 8 నుంచి 9 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ధర కూడా క్వింటాల్కు రూ.5 వేల వరకు పలుకుతుండడంతో గిట్టుబాటు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
-అయినవేణి పోతలింగు, రైతు, అందూర్
ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తొమ్మిది ఎకరాల్లో సోయా సాగు చేశా. సుమారు 70 క్వింటాళ్ల వరకు పంట పండింది. ధర కూడా ప్రస్తుతం అనుకూలంగానే కనిపిస్తున్నది. పెట్టుబడులు ఈ సంవత్సరం పెరిగినా దిగుబడి రావడంతో పంట లాభదాయకంగానే కనిపిస్తున్నది.
-మార కిరణ్కుమార్రెడ్డి, రైతు, ధన్నూర్ (బీ)