నిర్మల్ అర్బన్, అక్టోబర్ 22 : ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి నుంచి తప్పించుకునేలా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో డ్రగ్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అసంక్రమిత వ్యాధులైన డయాబెటిస్, హైబీపీ, క్యాన్సర్ లాంటివి ప్రజలను ఎక్కువగా పీడిస్తున్నాయన్నారు. వాటి బారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలన్నారు. వ్యాధులకు గురైన వారు ప్రభుత్వం అందించే మందులను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికా రి ధన్రాజ్, డిప్యూటీ డీఎంహెచ్వో రాజేందర్, కార్యక్రమ నిర్వహణ అధికారి శ్రీనివాస్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ సుభాష్ రావు పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ ఫంక్షన్ హాల్లో విశ్వహిందూ పరిషత్, గోరక్షక్ విభాగ్ ఆధ్వర్యంలో గోమయ ప్రమిదల పంపిణీని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలోని 10,000 దేవాలయాల్లో నవంబర్ 11న కార్తీక సోమవారం నాడు వెలిగించాలనే ఉద్దేశంతో అన్ని ఆలయాలకు చేరేలా పంపిణీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మొదటగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట ఆలయ చైర్మన్ లక్ష్మీ నర్సయ్యకు అందజేశారు. గోమయ ప్రతిమలను త యారు చేసిన దోముడాల ప్రవీణ్ దంపతులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, పాకాల రాంచందర్ , పతికె శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, అక్టోబర్ 22 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అర్హులైన రైతులకు పోడు వ్యవసాయం కింద సాగు పట్టాలను అందించనున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చైన్గేట్ వద్ద గోండు వీరుడు కుమ్రంభీం జయంతిని పురస్కరించుకొని శనివారం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల హక్కుల కోసం జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాడిన కుమ్రంభీం జీవితం ఆదర్శనీయమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భీం స్ఫూర్తితో గిరిజనులకు మౌళిక వసతులు కల్పిస్తున్నదని, ట్యాంక్బండ్ వద్ద భీం విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఆదివాసీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.