స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మంత్రి అల్లోల, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో విప్ గంప గోవర్ధన్ జాతీయ పతాకాలు ఎగుర వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని మంత్రి, ఆదిలాబాద్ జిల్లాలో 15,474 మందికి కొత్త పింఛన్లు మంజూరైనట్లు విప్ గోవర్ధన్ పేర్కొన్నారు.
విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా.. ప్రతిభ కనబర్చిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. చిన్నారుల వేషధారణలు ఆకట్టుకోగా.. ఆయా కార్యాలయాలు, కూడళ్ల వద్ద మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మహనీయుల చిత్రపటాలకు ప్రముఖులు పూలమాలలు వేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ) తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర వేడుకలను సోమవారం నిర్మల్ జిల్లాలో కనులపండువగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వల్ల మనకు స్వాతంత్య్రం వచ్చిందని, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పక్షం రోజులపాటు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నేడు మనం పీల్చుకుంటున్న స్వేచ్ఛా వాయువులు ఎందరో వీరులు వదిలిన తుదిశ్వాసల ఫలితమని వారి త్యాగాలను కొనియాడారు. దేశభక్తుల త్యాగం చిరస్మరణీయమని, ఈ సందర్భంగా ఆ మహనీయులను తలుచుకుంటూ వారి బాటలో నడిచేందుకు మనమందరం కంకణబద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. వారి స్ఫూర్తితో ముందుకు సాగుదామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచే జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని మంత్రి తెలిపారు. ఇదే స్ఫూర్తి, సేవాభావంతో పరిపాలనా దక్షతతో ముందుకు సాగుతూ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు శ్రమిద్దామన్నారు. వరద బాధితులకు తక్షణమే పునరావాసం కల్పించడంతోపాటు అన్ని రకాలుగా అండగా నిలిచామన్నారు. భారీ వరదల కారణంగా కడెం ప్రాజెక్టు గేట్లు చెడిపోయాయని, ప్రాజెక్టు కింద కాలువలు, చెరువులు దెబ్బతినగా.. వీటి మరమ్మతులకు రూ.9 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు.
జిల్లాకు కొత్తగా మెడికల్ కాలేజి మంజూరైందన్నారు. కాగా.. ఈ యేడు రైతుబంధు పథకం కింద వానకాలం పంట పెట్టుబడి సాయం కోసం 1,74,766 మంది రైతులకు రూ.226 కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. హరితహారం కింద ఇప్పటి వరకు 18 లక్షల 50 వేల మొక్కటు నాటడం పూర్తయిందని తెలిపారు. పదవ తరగతి ఫలితాల్లో 97.73 శాతంతో రాష్ట్రంలోనే మన జిల్లా రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు.
ప్రధాన రహదారులతోపాటు మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లను అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. రూ.192 కోట్లతో 38 చోట్ల కొత్త వంతెనల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విజయలక్ష్మీ, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్కుమార్, ఏఎస్పీ కిరణ్ ఖారే, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు అంబరాన్నంటాయి. సోమవారం జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు రిజ్వాన్ పాషా, నటరాజ్, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు.
వివిధ శాఖల్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, ఉద్యోగులకు విప్ ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ.. స్ఫూర్తిని రగిలించేలా ప్రభుత్వం వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నదన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బంగారు తెలంగాణ సాకారమవుతుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 15,674 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ.201.48 కోట్లతో 219 చెరువుల మరమ్మతులు చేపట్టినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా 1,50,290 నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. రైతుబంధు పథకంలో భాగంగా జిల్లాలో 1,47,906 మంది రైతులకు రూ.267 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్లో భాగంగా 24,694 మంది యువతులకు రూ.219.60 కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు హరితహారంలో భాగంగా 12 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. రిమ్స్తోపాటు పీహెచ్సీల ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దళితబంధు పథకం ద్వారా 249 మంది లబ్ధిదారులకు రూ.21.65 కోట్లతో వివిధ యూనిట్లు అందజేశామన్నారు.
1,883 నిరుపేద దళిత వ్యవసాయాధారిత కుటుంబాలకు రూ. 208.27 కోట్లతో 4,718 ఎకరాల భూమిని పంపిణీ చేశామన్నారు. మత్స్యకారుల ఉపాధిని పెంపొందించడంలో భాగంగా ఈ ఏడాది 284 చెరువుల్లో 1.30 కోట్ల చేప పిల్లలను వంద శాతం సబ్సిడీపై పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం నెలకొన్నట్లు తెలిపారు.