సిర్పూర్(టీ), ఆగస్టు 4 : మారుమూల గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సిర్పూర్(టీ) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల (కాగజ్నగర్)లో ఇంటర్మీడియెట్ విద్య (ఎంపీసీ, బైపీసీ) కోసం కేటాయించిన రెండు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో పాఠశాలలు, కళాశాలలు, గురకులాల్లో కనీస సౌకర్యాలు లేకుండా ఎవరూ చదువుకోలేక పోయారని, కానీ సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా అనేక వసతులతో గురుకులాలను ప్రైవేట్ పాఠశాల/కళాశాలలకు దీటుగా చేశారన్నారు.
ఉపాధ్యాయులు పిల్లలపై శ్రద్ధ చూపాలని, నాణ్యమైన విద్యనందించాలని ఆదేశించారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధించి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది , విద్యార్థులు ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ రీజియన్ గురుకులాల ఆర్సీవో కొప్పుల స్వరూపారాణి, ఏఆర్సీవో మహేశ్వర్రావు, డీసీవో బాలరాజు, ఎంపీడీవో రాజేశ్వర్, మండల కో ఆప్షన్ సభ్యుడు కీజర్హుస్సేన్, మండల ఉపాధ్యక్షుడు ఈర్త సత్యనారాయణ, ఎంపీటీసీ తుకారాం, సర్పంచ్లు యాదగిరి బ్రహ్మయ్య, ప్రభాకర్, ఉప సర్పంచ్ తోట మహేశ్, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, కాగజ్నగర్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత, నాయకులు ఇఫ్ఫత్, మొయిజ్, అస్లాం, ప్రసాద్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.