ఆదిలాబాద్ రూరల్, జూలై 26: దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల సేవలు మరువలేనివని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్గిల్లో పాకిస్థాన్పై యుద్ధం చేసి విజయం సాధించిన సైనికుల ధైర్య సాహసాలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
దేశం కోసం తమ ప్రాణాలను వదిలిన వీర సైనికుల సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోదని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. విజయ్ దివస్ సందర్భంగా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను మున్సిపల్ కమిషనర్ ఆదుముల్ల శైలజతో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నటరాజ్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శంకర్దాస్, అశోక్రావు తదితరులు పాల్గొన్నారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ పార్కులో అమరవీరులకు పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. ఇక్కడ కల్నల్ విక్రం జాదవ్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి, బెటాలియన్ సీఐ దేవీసింగ్, ఎస్ఐ రాకేశ్, వన్టౌన్ ఎస్ఐ సురేందర్, టూటౌన్ ఎస్ఐ శ్రీధర్గౌడ్, ట్రాఫిక్ సీఐ మల్లేశ్, కెప్టెన్ మజార్హుస్సేన్, మనోహర్, బాలాజీ, దేవ్రావ్, అభయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.