సింగరేణి ఏరియాల్లో ఇండ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ భారతీ హోళీకేరితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
మూడో విడుతలో భాగంగా క్యాతనపల్లిలో 408 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మన పథకాలు దేశానికే ఆదర్శమని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఎప్పుడూ ఇలాగే ఉండాలని ప్రజలను కోరారు. విప్ బాల్క సుమన్ చెన్నూర్ నియోజక వర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని, తనవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. విప్ సుమన్ మాట్లాడుతూ త్వరలో ‘సుమనన్న జనం బాట’ కార్యక్రమంతో అధికారులతో కలిసి అన్ని వార్డుల్లో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని, ఎవరు అడ్డుపడినా అభివృద్ధి యజ్ఞాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
రామకృష్ణాపూర్/మందమర్రి/మందమర్రి రూరల్, జూన్ 24 : సింగరేణి పారిశ్రామిక ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని విజయగణపతి దేవాలయంలో నిర్వహించిన మూడో విడుత సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్,కలెక్టర్ భారతితో కలిసి 408 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రాంత సమస్యలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. దేశంలో ఎవ్వరూ చేయలేని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందని కితాబు ఇచ్చారు. సింగరేణి ప్రాంతాల వారికి ఇండ్ల పట్టాలు అందడం అదృష్టమని, నేటితో వారి కల నెరవేరిందని తెలిపారు. ఇండ్ల స్థలాల కోసం జీవో-76 తెచ్చిన ఘనుడు విప్ బాల్క సుమన్ అని కొనియాడారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఎప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఏనాడూ అభివృద్ధి, ప్రజల అవసరాలను గుర్తించని గత పాలకులు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారని, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దొంగలు, మోసగాళ్లని వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. విప్ బాల్క సుమన్ చెన్నూర్ నియోజక వర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇండ్ల పట్టాల పంపిణీతో రామకృష్ణాపూర్ పట్టణానికి పూర్వ వైభవం వస్తుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఇండ్ల పట్టాల పంపిణీ అదృష్టంగా భావిస్తున్నాని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం క్యాతనపల్లి మున్సిపాలిటీకి శాపంగా మారిందని, 60 ఏండ్లల్లో ప్రజలకు ఇండ్ల పట్టాలు అందించాలనే ఆలోచన రాకపోవడం దురదృష్టకరమన్నారు. గతంలో ఇండ్ల పట్టాల పేరిట ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మూత పడిన గనుల వల్ల రామకృష్ణాపూర్ పట్టణ చరిత్ర మసకబారి పోయిందని తెలిపారు.
ఇండ్ల పట్టాలతో అప్పుల బాధలేకుండా తక్కువ ఖర్చుతో సొంత ఇంటిని నిర్మించుకోవచ్చని చెప్పారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు త్వరలో పూర్తికానున్నాయని, రవాణా వ్యవస్థకూడా మెరుగుపడుతుందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధి టీఆర్ఎస్ సర్కారు చేసిందని, దీనిపై ప్రజలు విస్తృతంగా చర్చ పెట్టాలని కోరారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.145.83 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. కుల పిచ్చి, మతపిచ్చి నాయకులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కాంగ్రెస్, బీజేపీ దుష్ప్రాచారాన్ని ప్రజలు విశ్వసించవద్దని కోరారు. అనంతరం మంత్రి మల్లారెడ్డిని పట్టణ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కృషి వల్లే నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుంన్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మందమర్రి పట్టణంలోని పాలచెట్టు ఏరియాలో రూ. 3.24 కోట్లతో నూతనంగా నిర్మించిన ఐటీఐ భవనంతో పాటు అంగడిబజార్ ఏరియాలో రూ. 20 లక్షలతో నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం, రూ. 2.05 కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల భవనాలను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్తో కలసి శుక్రవారం ప్రారంభించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా రూ. 1.27 కోట్లతో స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మార్కెట్లో దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన రేఖ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ షాపును ప్రారంభించారు. పొన్నారంలో రూ. 20 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విప్ సుమన్ కోరిక మేరకు ఐటీఐ భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ. కోటి, అంబేద్కర్ నైపుణ్య శిక్షణ కేంద్రంలో పరికరాల కొనుగోలుకు రూ. కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎవరు అడ్డుపడినా మందమర్రి మున్సిపాలిటీలో అభివృద్ధి యజ్ఞాన్ని ఆపేది లేదని విప్ బాల్క సుమన్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 160 కోట్లతో మందమర్రి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మందమర్రి, రామకృష్ణాపూర్లలో ఖాళీగా ఉన్న 1600 సింగరేణి క్యార్టర్లను పేద ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదని తెలిపారు. గతంలో మందమర్రిని పట్టించుకున్న నాయకుడే లేడని, కొంతమంది ఇక్కడ జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతన్నారని మండిపడ్డారు. త్వరలో సుమనన్న జనం బాట కార్యక్రమంతో అధికారులతో కలిసి అన్ని వార్డులకు వస్తానని, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం మందమర్రి మండలం పొన్నారంలో రూ. 20 లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేనుకుంట్ల ప్రవీణ్, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చెర్మన్ ఎర్రం విద్యాసాగర్రెడ్డి, ఆర్డీవో వేణు, తహసీల్దార్ సంపతి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, యాకూబ్ అలీ పాల్గొన్నారు.