ఇచ్చోడ, జూన్ 24 : ఇచ్చోడ సహా మండల వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం పడడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. ఇచ్చోడలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర సరకులు తడిసిపోయాయి. రోడ్లపై వరద ప్రవహించడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్థానిక విఠలేశ్వర మందిరం వద్ద మోకాళ్లలోతు నీరు నిలిచింది.
నార్నూర్, జూన్ 24 : ఉమ్మడి మండల వ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో వరద ఉప్పొంగింది. సాగుకు అనుకూల సమయం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చింతలమానేపల్లి, జూన్ 24 : మండల కేంద్రంలో రౌతు రావూజి (45) అనే రైతు శుక్రవారం సాయంత్రం పిడుగుపడి మృతిచెందాడు. పత్తి విత్తనాలు నాటుతున్న సమయంలో పిడుగుపడి తీవ్ర అస్వస్థతకు గురికాగా దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు.
ఇచ్చోడ, జూన్ 24 : మండలంలోని ముక్రా (బీ) గ్రామంలో శుక్రవారం పిడుగుపడి వాగత్కర్ సుగుణ (30) మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం… గ్రామానికి చెందిన వాగత్కర్ సుగుణకు ఎనిమిదేండ్ల కిందట మహారాష్ట్రలోని జల్థారా గ్రామానికి చెందిన తుకారాంతో వివాహం కాగా ఉపాధి కోసం ఇక్కడే స్థిరపడ్డారు. భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పత్తి విత్తనాలు వేస్తున్న సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగు పడడంతో సుగుణ అక్కడికక్కడే మృతి చెందింది. భర్త తుకారాం, తండ్రి గణేశ్కు స్వల్పంగా గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
నార్నూర్, జూన్ 24 : మండలంలోని మాన్కాపూర్ పంచాయతీ పరిధిలోని రాజుల్గూడ గ్రామానికి చెందిన షేక్ అయూబ్(45) శుక్రవారం పిడుగుపాటుతో మృతి చెందగా ఎల్.ప్రహ్లాద్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన ప్రకారం ఆయూబ్, ప్రహ్లాద్ కూలీ పనులకు వెళ్లగా మధ్యాహ్నం వర్షంతో పాటు పిడుగుపడింది. దాంతో అయూబ్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ప్రహ్లాద్ను మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడు అయూబ్కు భార్య, ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు.