నిర్మల్ అర్బన్, జూన్ 21 : నిర్మల్ జిల్లాలో సా ధారణ కాన్పుల సంఖ్య రోజురోజూ తగ్గిపోతున్నది. ధనార్జనే ధ్యేయంగా పుట్టగొడుగుల్లా వెలసిన ప్రైవేట్ దవాఖానాలు కాసుల కోసం కక్కుర్తి పడుతూ సిజేరియన్కే మొగ్గు చూపుతున్నట్లు బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారానికోసారి సాధారణ ప్రసవాలు చేస్తూ.. మిగతా రోజుల్లో వందల సంఖ్యలో కడుపు కోతలకు తెగబడుతున్నారు. ము హూర్తాల ద్వారా కాన్పుకు వచ్చే వారు ఒక శాతం మాత్రమే ఉండగా, మిగతా వారందరికీ ఏదో ఒకసాకు చెబుతూ వారు చేయాల్సింది చేసేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలోని 19 మండల్లాలో మొత్తం 25 ప్రభుత్వ దవాఖానలు ఉండగా, 85 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. జిల్లా కేంద్రంలోనే దాదాపు 30 ప్రైవేట్ ప్రసూతి దవాఖానలు ఉన్నాయి. కొన్ని దవాఖానాల్లో వైద్య అర్హత లేకున్నా కింది స్థాయి సిబ్బందితోనే కాన్పులు జరిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడే వారి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇక కొందరైతే దవాఖానలో అనుకోని ఘనట జరిగితే బయటకు పొక్కకుండే నయానో..బయానో ఇచ్చకుంటూ చేతులు దులుపుకుంటున్నారు. దవాఖాన బోర్డుపై ఒక డాక్టరు ఉంటుండగా, ఆపరేషన్ చేసేది మాత్రం ఇంకొకరు ఉండడంపై రోగులు, కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. వీరిపై జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు.
నిర్మల్ జిల్లాలోని 85 ప్రైవేట్ దవాఖానాల్లో జోరుగా సిజేరియన్లు జరగడంపై జిల్లా ఉన్నతాధికారుల్లో ఆందోళన మొదలైంది. ఏమాత్రం నిబంధనలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 74 శాతం సిజేరియన్లు జరిగినట్లు గణాంకాల ద్వారా తెలుస్తుంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు ప్రైవేట్ దవాఖానల్లో మొత్తం 5,533 ప్రసవాలు జరిగాయి. ఇందులో 317 మాత్రమే సాధారణ ప్రసవాలు కాగా, 5,216 ప్రసవాలు సిజేరియన్లు కావడం గమనార్హం.
ఈ లెక్కన ప్రైవేట్ దవాఖానల్లో ఏ మేరకు శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 6,844 కాన్పులు కాగా, ఇందులో 2,416 సాధారణ, 4,428 శస్త్ర చికిత్సలు ఉన్నాయి. కేవలం సగటున నెలలో జరిగిన ప్రసవాలను పరిశీలిస్తే ఏప్రిల్- మే నెల వరకు ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 976 ప్రసవాలు జరుగగా, ఇందులో సాధారణ ప్రసవాలు 382, శస్త్ర చికిత్సలు 594 ఉన్నాయి. ప్రైవేట్ దవాఖానల్లో మొత్తం 518 ప్రసవాలు అయితే, ఇందులో 68 సాధారణ ప్రసవాలు కాగా, 450 శస్త్ర చికిత్సలు ఉన్నాయి.
ప్రైవేట్ దవాఖానాల్లో జరిగే శస్త్ర చికిత్సలపై దృష్టి పెడతాం. 60 శాతం కంటే ఎక్కువ సిజేరియన్లు చేసే హాస్పిటల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ దవాఖాలను రోగులకు అన్ని వసతులు కల్పించాలి. ప్రభుత్వ దవాఖానాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య మరింత పెంచే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– ధన్రాజ్, డీఎంహెచ్వో, నిర్మల్