వేర్వేరు చోట్ల పిడుగు పాటుకు నలుగురు మృత్యువాతవర్షాలు పడుతుండడంతో ఎన్నో ఆశలతో చేలకు బయలుదేరిన వారిని విధి వెంటాడింది. పత్తి విత్తనాలు విత్తుతుండగా పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. ఇద్దరు మహిళా కూలీలతో పాటు మరో ఇద్దరు రైతులు కన్నుమూయగా, ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వేర్వేరు చోట్ల ఈ ఘటన జరిగింది. కాగా, కాగజ్నగర్ మండలం రాస్పెల్లికి చెందిన సాదుల సుమన్(27) పుట్టిన రోజు నాడే (రెండు నెలల క్రితమే పెళ్లి) మృత్యువాత పడగా, ఆ ఊరి ప్రజలను కలచివేసింది.
కోటపల్లి, జూన్ 20 : మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం అంకమ్మ (55) పిడుగుపాటుతో సోమవారం మృతి చెందింది. అంకమ్మ తోటి కూలీలతో కలిసి కొండంపేట గ్రామ శివారులోని చేనులో పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులు సంభవించి ఒక్కసారిగా పిడుగుపడగా అంకమ్మ అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కోటపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.
రెండేళ్ల క్రితం అంకమ్మ భర్త పోచయ్య రోడ్డు ప్రమాదంలో మరణించగా, సోమవారం పిడుగు పాటుతో అంకమ్మ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. కూలీ పనులు చేస్తూ జీవించే వీరికి ముగ్గురు సంతానం కాగా బిడ్డ సమ్మక్క, కొడుకులు రామచంద్రం, రాజేశ్ ఉన్నారు. ఇందులో బిడ్డకు పెండ్లి కాగా, రామచంద్రం ఉపాధ్యాయుడిగా, రాజేశ్ ఇంటి వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేండ్లలోనే భార్యాభర్తలు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది.
కౌటాల, జూన్ 20 : మండలంలోని వైగాం గ్రామంలో సాయంత్రం పిడుగుపడి సద్గరే రేఖాబాయి (41) మృతి చెందింది. గ్రామ శివారులో పత్తి విత్తనాలు పెట్టేందుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వచ్చి రేఖాబాయిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు భర్త సురేశ్ తెలిపారు. మృతురాలికి కూతురు, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న కౌటాల ఎస్ఐ మనోహర్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
కాగజ్నగర్ రూరల్,జూన్ 20 : మండలంలోని రాస్పెల్లి, అంకుసాపూర్ గ్రామాల్లో పిడుగుపాటుతో ఇద్దరు రైతులు మృతి చెందారు. రా స్పెల్లి గ్రామానికి చెందిన సాదుల సుమన్ (27), అంకుసాపూర్ గ్రామానికి చెందిన షెండె నానాజీ (36) గ్రామ సమీపంలోని చేనులో పత్తి విత్తనాలు పెట్టేందుకు వెళ్లారు. సాయంత్రం ఉరుములతో వర్షం పడడంతో వారు చెట్ల కిందకు వెళ్లి కూర్చున్నారు. ఒక్కసారిగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కాగా సాదుల సుమన్ పుట్టిన రోజు నాడే చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొన్నది. సుమన్కు రెండు నెలల క్రితం పెంచికల్పేట మండలం దరోగపల్లికి చెందిన అనుషతో వివాహమైంది. అంకుసాపూర్ గ్రామానికి చెందిన షెండే నానాజీ వ్యవసాయం చేసుకుంటూ కు టుంబాన్ని పోషిస్తున్నాడు. మృతుడికి భార్య నీ లాబాయి, కుమారుడు సందీప్, కూతురు సం ధ్యారాణి ఉన్నారు. బాధిత కుటుంబాలను జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు పరామర్శించా రు. కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. వీరి వెంట టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
దహెగాం, జూన్ 20 : మండలంలో ఆదివారం సాయంత్రం పిడుగుపడడంతో ఇట్యాల గ్రామానికి చెందిన దుర్గం శంకర్, బోర్లకుంట గ్రామానికి చెందిన గోండ్రె ఒత్తుకు చెందిన రెండు ఎడ్లు మృతి చెందాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడ్లు మేతకు వెళ్లిన సమయంలో ఒకేసారి గాలివాన రావడంతో పశువులు చెట్ల కిందికి వెళ్లాయి. అదే సమయంలో చెట్టుపై పిడుగుపడడంతో ఎడ్లు అక్కడిక్కడే మృతి చెందాయి. రెండింటి విలువ రూ. 80 వేల వరకు ఉంటుందని తెలిపారు. పశువైద్యాధికారులకు సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు.