మందమర్రి జూన్ 17 : సింగరేణిలో జాతీయ సంఘాలు పోగొట్టిన వాటితో పాటు అనేక కార్మిక హక్కులను టీబీజీకేఎస్ హయాంలో సాధించినట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మందమర్రిలోని సీఈఆర్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏరియాలోని వివిధ గనులకు చెందిన సుమారు 70 మంది కార్మికులు టీబీజీకేఎస్లో చేరారు. కాగా, వారికి విప్ సుమన్, యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్, అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు.
గతంలో జాతీయ సంఘాలు తాకట్టుపెట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి అమలుచేయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. గుర్తింపు ఎన్నికల సమయం దగ్గర పడడంతో జాతీయ సంఘాల నాయకులు గనులపైకి వచ్చి, లేనిపోని మాటలతో మరోసారి కార్మికులను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు జాతీయ సంఘాల నాయకుల కుట్రలను తిపికొట్టాలని పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, జే రవీందర్, వో రాజశేఖర్, భూపల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.