ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. ద్వితీయ శ్రేణి నగరాలకు విమానాశ్రయాలను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణలో ఆరింటికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, అందులో ఆదిలాబాద్ కూడా ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సానుకూల నివేదికలు ఇచ్చినా, మోడీ సర్కారులో మాత్రం చలనం లేదు. హైదరాబాద్కు వచ్చిన కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఇటీవల విమానాశ్రయాల ఏర్పాటు ఆవశ్యకతను సీఎం కేసీఆర్ వివరించినా ఫలితం లేదు.
దేశవ్యాప్తంగా ఉడాన్ పథకంలో భాగంగా రెండో శ్రేణి నగరాల్లో విమానాశ్రాయలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ విమానాశ్రయాల ఏర్పాటు ఆటకెక్కింది. ఆదిలాబాద్లో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు అన్ని సానుకూలల అంశాలే ఉన్నా, ఆ దిశగా చర్యలు తీసుకోకుండా కేంద్రం కక్షసాధిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాకు చెందిన వారు విమానాల్లో ప్రయాణించాలంటే హైదరాబాద్ లేదా మహారాష్ట్రలోని నాగ్పూర్కు వెళ్లాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి నాగ్పూర్ 200 కిలోమీటర్లు, హైదరాబాద్ 300 కిలోమీటర్ల దూరం ఉంటాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం ఆదిలాబాద్లో కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. డీపీఆర్ను తయారు చేయడానికి ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి రాష్ట్ర ప్రభుత్వం రూ.4.5 కోట్లు చెల్లించింది.
ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా ఏఏఐ బృందం సభ్యులు జిల్లాలో పర్యటించి పలు అంశాలను పరిశీలించారు. రెవెన్యూ, రోడ్లు భవనాలు, సర్వే అధికారులు ఏఏఐ అధికారులు అడిగిన వివరాలను అందజేశారు. విమానాశ్రయం ప్రారంభించడానికి అవసరమైన అంశాలను వివరంగా తెలుసుకున్నారు. రన్వే దిశ, విండ్ డైరెక్షన్, విమానాలకు దిగేటప్పుడు, పైకిలేచేప్పుడు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అనే విషయాలను అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ఎయిర్ఫోర్స్ స్థలం 369 ఎకరాలు ఉందని, మరో 49 అవసరమవుతాయని రెవెన్యూ అధికారులకు సూచించారు.
దీంతో వారు మళ్లీ సర్వే నిర్వహించి ఏఏఐ అధికారులకు స్థలం వివరాలు అందజేశారు. మూడు విడుతలుగా ఆదిలాబాద్లో పర్యటించిన ఏఏఐ బృందం సభ్యులు పలు అంశాలను పరిశీలించి, ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుకు సానుకూలంగా కేంద్రానికి నివేదికలు ఇచ్చారు. ఇదంతా పూర్తయి విమానాశ్రయం రెండేళ్లు గడుస్తున్నా కేంద్రంలో చలనం లేదు. హైదరాబాద్కు వచ్చిన కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకువిమానాశ్రయాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించినా ఫలితం లేదు. ఏయిర్పోర్టు ఏర్పాటు విషయంలో కేంద్ర అవలంబిస్తున్న వైఖరిని జిల్లా వాసులు ఖండిస్తున్నారు.