జైపూర్, మే 27 : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలిచిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నెరవేర్చినట్లు టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య తెలిపారు. డివిజన్లోని ఇందారంఖని 1ఏ గనిపై శుక్రవారం గేట్మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. కోల్ఇండియాలో లేని విధంగా సింగరేణిలో కార్మికుల హక్కులను సాధించిపెట్టామన్నారు. కొన్ని జాతీయ సంఘాలు పనిగట్టుకొని కార్మికులకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, వాటిని కార్మికలోకం తిప్పి కొడుతుందని పేర్కొన్నారు. జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల కోసం చేసిన ఒక్క పనినైనా చూపించాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యంతోనే ఈ రోజు కార్మికుల పిల్లలు కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఇంటిబిడ్డ ఈ రోజు సింగరేణిలో పని చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనేనని పేర్కొన్నారు. జాతీయ సంఘాలు సంతకాలు చేసి పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలు ఈ రోజు కారణ్య నియామకాల రూపంలో యువత ఉద్యోగాల్లోకి వస్తున్నారంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ చలువేనని వివరించారు. ప్రతిపక్షాలు గనులపైకి వస్తే కార్మికులకు ఏం జేశారో అడుగాలన్నారు.
గత పాలకుల హయాంలో కార్మికుడు గని ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షల ఎక్స్గ్రేసియా ఇచ్చేవారని, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.20 లక్షలు, సాధారణ మరణానికి రూ.15లక్షల నష్టపరిహారం పెంచిన ఘనత టీబీజీకేఎస్దే అన్నారు. లాభాలవాట 16 శాతం నుంచి 29 శాతం వరకు పెంచారంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యంతోనేనని వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయన్నారు.
కార్యక్రమం అనంతరం వివిధ సంఘాల నుంచి 120 మంది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చేరారు. వారికి కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. కేంద్ర ఉపాధ్యక్షుడు డీ అన్నయ్య, చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగళ కుమారస్వామి, ఏరియా చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీశ్వర్రెడ్డి, పిట్ సెక్రటరీ గడ్డం మల్లన్న, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు రాంచందర్, రత్నాకర్రెడ్డి, నాయకులు కొమురయ్య, మల్లేశ్, రామస్వామి, భూమయ్య, యాకూబ్అలీ పాల్గొన్నారు.