మామడ, మే 23 : మామడ మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండలాధ్యక్షురాలు రాథోడ్ అమృత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కాగా, జడ్పీ చైర్పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ కృషిచేస్తున్నదన్నారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా సర్పంచ్లు, ఎంపీటీసీలు సర్వసభ్య సమావేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా పలువురు సభ్యులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. నల్దుర్తి గ్రామంలో మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదని దిమ్మదుర్తి ఎంపీటీసీ పడాల శ్రీనివాస్ సమావేశంలో వివరించారు. గ్రామాల్లో వేలాడే విద్యుత్ తీగలను సరిచేయాలని మామడ సర్పంచ్ హన్మాగౌడ్, గాయిద్పెల్లి సర్పంచ్ రాందాస్ పేర్కొన్నారు.
జీపీ భవనం లేక ఇబ్బందులుపడుతున్నామని, మంజూరుకు కృషిచేయాలని ఆదర్శనగర్ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ రాథోడ్ సోనియా, ఎంపీడీవో మల్లేశం, వైస్ ఎంపీపీ లింగారెడ్డి, తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీవో గోవర్దన్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘మన ఊరు-మన బడి’లో భాగంగా తాండ్ర ప్రాథమిక పాఠశాల ఆవరణలో జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి పనులను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు కార్పొరేట్స్థాయిలో విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ బడుల బాగుకోసం ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రుచిత, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, నాయకులు సంతోష్, జాలం తదితరులు పాల్గొన్నారు.