పుట్టే బిడ్డ జాతకం బాగుండాలని అనుకోవడంలో తప్పు లేదు. మంచి ముహూర్తంలో పుట్టాలని కోరుకోవడంలో తప్పు లేదు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో సంతానం కావాలని ఆశించడంలో తప్పు లేదు. కానీ, అందుకోసం సిజేరియన్ల వైపు మొగ్గు చూపడం ఆందోళన కలిగిస్తున్నది. శిశువు గర్భంలో ఉండగానే ముహూర్తాలు పెట్టి.. ఆ సమయానికే సిజేరియన్లు చేయించే మూఢనమ్మకాల ధోరణి ఇటీవలి కాలంలో పెరుగుతున్నది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రమాణాల ప్రకారం.. ప్రసవాల్లో కేవలం 10 శాతం వరకు సిజేరియన్లు ఉండాలి. కానీ, మన రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా ఉన్నది. ఇందుకు మంచి రోజులు, పెట్టుడు ముహూర్తాలే ప్రధాన కారణంగా తెలుస్తున్నది. సిజేరియన్ల వల్ల భవిష్యత్తులో తల్లుల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు ఎంత మొత్తుకున్నా కొందరిలో మార్పు రావడం లేదు. అన్నీ తెలిసిన విద్యావంతులే ‘కడుపుకోత’కు మొగ్గు చూపుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.
నార్మల్ డెలివరీలు తల్లీబిడ్డల ఆరోగ్యానికి శ్రేయస్కరమని, శస్త్రచికిత్సలతో భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నా.. కొంత మందిలో మార్పు రాకపోవడం ఆపరేషన్లు పెరగడానికి కారణమవుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రసవాల్లో పది శాతం సిజేరియన్లు మాత్రమే ఉండాల్సి ఉన్నా.. ఉమ్మడి జిల్లాలో అందుకు భిన్నంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో సహజ కాన్పులను పెంచి, ముహూర్తాల సిజేరియన్లకు చెక్ పెట్టే దిశగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రయత్నం మొదలు పెట్టింది.
– ఎదులాపురం/నిర్మల్ చైన్గేట్, మే 23
ప్రసవాలు పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘కేసీఆర్ కిట్’ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వం సాధ్యమైన మేరకు సాధారణ కాన్పులను ప్రోత్సహిస్తున్నది. ఫలితంగా గతంతో పోలిస్తే సర్కారు వైద్యశాలల్లో నార్మల్ డెలివరీలు ఎక్కువగానే అవుతున్నా.. అదే ప్రైవేట్లో చూస్తే సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ కొత్త విష సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని, సాధారణ ప్రసవాలు పెంచేలా చూడాలని ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
సిజేరియన్లు ప్రైవేటులో పెరగడానికి ముహూర్తాలే ఒక ప్రధాన కారణమని తెలుస్తున్నది. చాలా మంది తల్లిదండ్రులు, బంధువులే దీనిని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి, దసరా వంటి పండుగలు, ఆగస్టు 15, గాంధీ జయంతి, జనవరి 1 వంటి ప్రత్యేక తేదీలు, పెండ్లి రోజు, పుట్టిన రోజు.. అంటూ ప్రత్యేక సందర్భాలకు గుర్తుగా తమ పిల్లల పుట్టిన రోజులు ఉండాలనో.. లేదా బిడ్డ జాతకం బాగుండాలనో.. దోషాలు లేకుండా ఉండాలనో.. కోరుకునేవారు కూడా ఈ మధ్య ఎక్కువయ్యారు.
ముహూర్తాలు చూపించుకొని.. ఆ ముహూర్తానికే సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగేలా చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డెలివరీకి వారం పది రోజులు అటీటుగా శస్త్ర చికిత్స చేయిస్తున్నారు. దీని ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసినా.. వినకుండా సీ-సెక్షన్ ఆపరేషన్లకే మొగ్గు చూపుతున్నారు. కొన్నిచోట్ల వైద్యులు వ్యతిరేకించిన సమయంలో కొంత మంది ఇతర దవాఖానలకు వెళ్తున్నారు.
సాధారణ కాన్పులు తల్లీబిడ్డకు క్షేమకరం. నాలుగైదు గంటలు పురిటి నొప్పులు భరించినా.. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పుతా యి. నార్మల్ డెలివరీ వల్ల రక్తస్రావం తక్కువ. మొదటిసారి సహజ ప్రసవం అయితే రెండోసారి కూడా సుఖ ప్రసవం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాన్పు జరిగిన మూడు నాలుగు రోజుల నుంచే తన పనులు తాను చేసుకోవడానికి వీలుంటుంది.
బిడ్డ పుట్టిన గంటలోగా ముర్రుపాలు తాగించే అవ కాశముంటుంది. శిశువుకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉటుంది. వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువ. పుట్టే పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వెనుకటి తరం వాళ్లు ఎక్కువగా సహజ ప్రసవాలవైపే మొగ్గుచూపేవారు. గర్భం ధరించింది మొదలు మహిళలను సాధారణ ప్రసవానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసేవారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లోనే 66 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6,017 ప్రసవాలు జరిగాయి. ఇందులో 3,348 సాధారణ.. 2,669 సిజేరియన్ అయ్యాయి. కాగా.. ప్రైవేట్ దవాఖానల్లో 15 శాతం సాధారణ ప్రసవాలు మాత్రమే జరిగాయి. అంటే 85 శాతం సిజేరియన్లు అన్నమాట. 2021-22 సంవత్సరంలోని ఏప్రిల్ నెల వరకు మొత్తం 4,505 ప్రసవాలు కాగా.. ఇందులో 625 సాధరణ.. 3,880 సీజరియన్లు అయ్యాయి.
నిర్మల్ జిల్లాలో 2021-22 సంవత్సరానికి గాను ఆపరేషన్లు 6,844 అవుతుండగా.. ఇందులో ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 2416, ఆపరేషన్లు 4,428 అవుతున్నాయి. ప్రైవేట్ దవాఖానల్లో 5533 ప్రసవాలు అవుతుండగా.. ఇందులో సాధారణ 317, సర్జరీలు 5,216 అవుతున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే మోస్తారులో జరుగుతుండగా, ‘ముహూర్తాల వీక్నెస్’ను కొంత మంది ప్రైవేట్ వైద్యులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తున్నది. అయితే, చాలా మంది గైనకాలజిస్టులు ఈ తీరును వ్యతిరేకిస్తున్నారు. సిజేరియన్లు పెరగడానికి తామే కారణమన్న అపోహ పెరిగిపోయిందని, ఇది తప్పు అని అంటున్నారు.
సాధారణ ప్రసవం చేయాలని ప్రయత్నించినా, కొందరు భార్యాభర్తలు, వారి కుటుంబసభ్యులు సిజేరియనే కావాలంటూ మొండిపట్టు పడుతున్నారని అంటున్నారు. ‘మా బిడ్డ సున్నితంగా పెరిగింది. నొప్పులు తట్టుకోలేదు’ అని తల్లిదండ్రులు, ‘మా ఆవిడ కష్టపడటం చూడలేను’ అని భర్తలు, ‘వామ్మో ఐదారు గంటలు నొప్పులు పడడం నావల్ల కాదు. సిజేరియన్ చేయండి’ అని గర్భిణులు ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు.
మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 83 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9,659 ప్రసవాలు జరగగా.. ఇందులో 2,676 సాధారణ, 6,983 సిజేరియన్ అయ్యాయి. సాధారణ ప్రసవాలు ప్రైవేటు దవాఖానల్లో 463, ప్రభుత్వ దవాఖానల్లో 2,213 జరిగాయి.
సిజేరియన్ వల్ల తల్లికి, బిడ్డకు నష్టం. ఈ ఆపరేషన్కు గంట సమయమే తీసుకున్నా, భవిష్యత్తులో తల్లి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరంలో నాలుగైదు లేయర్లు కట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే గర్భాశయం నుంచి బిడ్డను బయటికి తీయడం సాధ్యమవుతుంది. రక్తస్రావం కూడా అవుతుంది. పైగా సిజేరియన్ తర్వాత గాయం మానడానికి చాలా సమయం తీసుకుంటుంది.
కనీసం మూడు నెలలపాటు విశ్రాంతి అవసరమవుతుంది. ఆలోగా తగిన జాగ్రత్తలు, పోషకాహారం తీసుకోకపోతే హెర్నియా, కడుపునొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. పుట్టిన బిడ్డకు గంటలోగా ముర్రుపాలు తాగించాల్సి ఉంటుంది. అవి అమృతంతో సమానం. సిజేరియన్ వల్ల ముర్రుపాలు పట్టించే అవకాశమే లేకుండా పోతున్నది.
సకల జీవకోటిలో మనిషి జన్మ ఉత్తమమైనది. పుట్టిన శిశువు బాగుండాలని, దోషాలు లేకుండా శుభలగ్నం నిర్ణయించుకొని పిల్లలను కనడం శాస్త్ర విరుద్ధం. భగవత్ సంకల్ప సహజ జనన కాలమే జన్మలగ్నం నిర్ధారించ బడి, అటుపై జాతకం, దాని ఫలం సాక్షాత్కరింపబ డుతుంది. అంతేగానీ, బలవంతంగా శస్త్రచికిత్స ద్వారా పుట్టిన పిల్లల జాతక ఫలాలు తేడా ఉండడం, గణితలోపం లేకుండా విశ్లేషించబడిన జాతక లక్షణాలేవీ ఆ జాతకుడి జీవితంలో పొడచూపకపోవడం గమనిస్తూనే ఉన్నాం.
‘కర్మానుసారేనా పతీ పత్నీ సుతాలయా..’ అన్నట్లు మనం చెప్పిన సమయానికి కూడా శస్త్రచికిత్స జరగకపోవడం ఆలస్యం కావడం కూడా గమనిస్తున్నాం. ఏదేమైనా సంకల్పిత శస్త్రచికిత్స ద్వారా సంతానం పొందడం, తద్వారా ఉత్తమ భోగభాగ్యాలు లభిస్తాయను కోవడం శాస్త్రవిరుద్ధం. ఇది ఏమాత్రం క్షేమకరం కాదు.
– సంగనభట్ల నరహరిశర్మ, ప్రధాన అర్చకులు, మంచిర్యాల
ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్(పీహెచ్సీ) ద్వారా ప్రభుత్వ దవాఖానలో సాధరణ, సుఖప్రసవాలు చేసు కోవాలని గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం. గర్భిణీకి ప్రతి నెల వైద్య పరీక్ష చేయించుకోవడానికి సంబంధిత ఆశ కార్యకర్త వెంట ఉంటుంది. పరీక్షల కోసం రిమ్స్, సీహెచ్సీ, పీహెచ్సీకి స్కానింగ్ పరీక్షల కోసం తీసుకొస్తారు. వారికి సాధారణ ప్రసవాల గురించి వాటి ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నాం. చాలా మంది మొగ్గు చూపుతున్నారు.
– డాక్టర్ నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో, ఆదిలాబాద్
ఈడీడీ(ఎస్టిమే టెడ్ డ్యూ డేట్) ప్రకారమే ప్రసవాలు చేస్తున్నాం. మొదటిసారి సిజేరియన్ అయి.. రెండోసారి ఏమైనా క్లిష్ట పరిస్థితులుంటే తప్ప శస్త్ర చికిత్సలు చేయడం లేదు. మొదటిసారి కాన్పు సమయంలో అవగాహన కల్పిస్తున్నాం. ఈ విషయాన్ని గర్భిణులకు, వారి కుటుంబ సభ్యులకు వివరిస్తున్నాం. పిల్లలు పుట్టే సమయమే సుముహూర్తమని నార్మల్ డెలివరీలవైపు ప్రోత్సహిస్తున్నాం. మొదటిసారి అయితే సాధారణ ప్రసవాలే చేస్తున్నాం. అయినా ఒత్తిళ్లు తప్పడం లేదు. ముహూర్తాల పేరిట అనవసరంగా ఒత్తిడి తేవద్దు.
– నీనా గుజరాతి, గైనకాలజిస్ట్, ప్రైవేట్ దవాఖాన, ఆదిలాబాద్