మంచిర్యాల టౌన్, మే 21 : పట్టణ ప్రజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిచోట్లా పార్కుల నిర్మాణాలను చేపడుతున్నది. ఇందులో భాగంగా మంచిర్యాల పట్టణంలోని పలు వార్డుల్లో పార్కుల నిర్మాణాలకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇందుకు పట్టణ ప్రగతి నిధులను వెచ్చిస్తున్నారు. ఈ పార్కుల నిర్మాణానికి సంబంధించిన నమూనాలు, త్రీడీ ప్రింట్లు ఖరారయ్యాయి. ఇప్పటికే పార్కుల ప్రతిపాదిత స్థలాల్లో పనులు ప్రారంభమయ్యాయి.
పాతమంచిర్యాలలోని శ్రీలక్ష్మీనగర్లో రూ. 90 లక్షలతో రెండున్నర ఎకరాల్లో పార్కు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ స్థలాన్ని నాలుగు విభాగాలుగా విభజించి ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నారు. చిన్నచిన్న ఫంక్షన్లు, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఓపెన్ స్టేజీ, గ్యాలరీలను నిర్మించనున్నారు. పాత్వేలు, వాచ్మెన్ క్వార్టర్, ఓపెన్ జిమ్, పిల్లల కోసం పార్కు, పరికరాలు, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ, స్వాగత ఆర్చ్లు, గేట్ల వంటివి నిర్మించనున్నారు.
స్థలాన్నిబట్టి వీలైనన్ని వసతులు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాంనగర్లో 25 గుంటల స్థలంలో రూ. 90 లక్షలు వెచ్చించి పార్కు నిర్మించనున్నారు. గర్మిళ్లలో 20 గుంటల స్థలంలో రూ. 90 లక్షలు, రెడ్డి కాలనీలో ఎనిమిది గుంటల స్థలంలో రూ. 40 లక్షలు, రాజీవ్నగర్లో 26 గుంటల స్థలంలో రూ. 60 లక్షలు, హైటెక్ కాలనీలో 35 గుంటల స్థలంలో రూ. 50 లక్షలు వెచ్చించి పార్కుల నిర్మాణాలు చేపట్టనున్నారు. మరికొన్ని రోజుల్లో పట్టణ ప్రజలకు సుందరమైన పార్కులు అందుబాటులోకి రానున్నాయి.
పట్టణ ప్రగతి నిధులతో చేపడుతున్న పార్కుల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులను మున్సిపాలిటీలకు విడుదల చేయలేదు. పట్టణ ప్రగతితోపాటు జనరల్ ఫండ్, ఇతర స్కీంల ద్వారా కోట్లాది రూపాయల నిధులు మంజూరవుతున్నాయి. మంచిర్యాల పట్టణంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది.ప్రజలకు మెరుగైన సేవలు, వారి అవసరాలకు తగ్గట్టు పనులు చేయడంతో పాలక వర్గం ముందుంటుంది.
– పెంట రాజయ్య, మున్సిపల్ చైర్మన్, మంచిర్యాల