మంచిర్యాల, మే 21, నమస్తే తెలంగాణ : భూగోళంపై ఉన్న వివిధ జీవుల మధ్యన ఉన్న భేదాన్నే ‘జీవ వైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల మీద జీవ వైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. మన జీవన శైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతున్నది. దీంతో జీవ వైవిధ్యం దెబ్బ తింటున్నది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇది వరకు ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రానురానూ అవి కనుమరుగైపోతున్నాయి.
ఈ భూగోళంపై ఉన్న ప్రాణులన్నీ.. మిగతా ప్రాణులపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అన్ని ప్రాణులకు ఆహారం లభించాలంటే జీవులన్నీ బతకాలి. వైవిధ్యం నిలవాలి. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మే 22న నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని 1992లో కెన్యా దేశంలోని నైరోబి నగరంలో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రతి సంవత్సరం వేర్వేరు సందేశాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. 2022లో ‘బిల్డింగ్ ఏ షేర్డ్ ఫ్యూచర్ ఫర్ ఆల్ లైఫ్’ జీవితమంతా భాగసౌమ్య భవిష్యత్తును నిర్మించడం అనే సందేశంతో అవగాహన కల్పిస్తున్నది.
మానవ మనుగడకు జీవ వైవిధ్యం ఆధారమైంది. దీన్ని రక్షించాల్సిన ఆవశ్యకత ప్రతి పౌరుడిపైనా ఉంది. నరికిన ప్రతి చెట్టుకు బదులుగా మరో 2 మొక్కలు పెంచాలి. జీవ వైవిధ్య పర్యావరణ చట్టాలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు, శిక్షలను మరింత కఠిన తరం చేయాలి. అక్రమ కలప, జంతు రవాణాను అరికట్టాలి. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని పటిష్టం చేయాలి. అటవీ వ్యవసాయ తోటల పెంపకాన్ని అనుమతించవద్దు. దేశంలోని 497 అభయారణ్యాలు, 27 టైగర్ ప్రాజెక్ట్ పరిశోధనా శాలలను ప్రత్యేకంగా నిర్వహించాలి. పర్యావరణ దినం, భూగోళ సంరక్షణ దినం, జీవ వైవిధ్య దినోత్సవాల సందర్భంగా అవగాహన కల్పించాలి. జీవ వైవిధ్య సదస్సులో జరిగిన తీర్మానాలను చిత్త శుద్ధితో అమలు చేయాలి.
వ్యవసాయంలో మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణా రహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవ సంపదను కోల్పోవాల్సి వస్తున్నది. అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే విధంగా మన దేశం విరాజిల్లుతున్నది. ఇటువంటి అవాంఛనీయ చర్యలతో దారుణంగా నష్టపోవాల్సి వస్తున్నది. అపార జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఈ వైవిధ్యం తరచుగా అనేక రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవుల పరంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు సుమారు 1.75 మిలియన్ జాతులను గుర్తించారు. ఎక్కువగా కీటకాలు వంటి చిన్న జీవులు ఉన్నాయి. వాస్తవానికి 13 మిలియన్ జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు లెక్కించారు. జీవ వైవిధ్యంలో ప్రతి జాతిలోని జన్యుపరమైన తేడాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పంటల రకాలు, పశువుల జాతుల మధ్య క్రోమోజోములు, జన్యువులు, డీఎన్ఏ, జీవితం బిల్డింగ బ్లాక్స్, ప్రతి వ్యక్తి, ప్రతి జాతి ప్రత్యేకతను నిర్ణయిస్తాయి.
జీవ వైవిధ్యానికి హాని చేసే మానవ జీవనశైలిని మార్చుకోవాలి. భూ తాపాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. జంతువులు, మొక్కలను పరిరక్షించుకోవాలి. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు విరివిగా అవలంభించాలి. అంతరించే ప్రమాదం ఉన్న జాతులను ప్రతిష్ట చేసి రక్షించాలి. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనలను రక్షిస్తుంది. అప్పుడే జీవ వైవిధ్యం ఫలాలు రేపటి తరాలకు అందుతాయి. సకల ప్రాణ కోటి మనుగడ నిరంతరాయంగా కొనసాగుతుంది.
– గుండేటి యోగేశ్వర్, అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ప్రతినిధి, పర్యావరణ వేత్త, మంచిర్యాల