“టీఆర్ఎస్ పార్టీ, మంత్రి కేటీఆర్, విప్ బాల్క సుమన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం. సోనియాను బలిదేవత అన్న నీవు ఇంటిపార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్లో చేరడం విడ్డూరం. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకే రేవంత్ రెడ్డితో జతకట్టావు. రానున్న రోజుల్లో ఓదెలు కుటుంబానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.” అని మంచిర్యాల, మంద మర్రి, చెన్నూర్ పట్టణాల్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మంచిర్యాల జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, చెన్నూర్ ఎంపీపీ బాపు, మున్సిపల్ చైర్మన్ అర్చన గిల్డా, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రావు మాట్లాడారు. ఓదెలుకు ఎమ్మెల్యే, విప్గా.. ఆయన భార్యకు జడ్పీచైర్ పర్సన్గా కేసీఆర్ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వ విప్ ఈ మూడేండ్ల కాలంలో వందల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.
మంచిర్యాలటౌన్, మే 19: మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ నల్లాల ఓదెలు, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ను, నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని మంచిర్యాల జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య హెచ్చరించారు. గురువారం మంచిర్యాలలోని ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి వారు మాట్లాడారు.
చెన్నూర్ ఎమ్మెల్యే బాల్కసుమన్ తనను బెదిరిస్తున్నారని, ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్కు చెప్పినా పట్టించుకోలేదని విమర్శలు చేయడం తగదన్నారు. సీఎం కేసీఆర్ రెండుసార్లు చెన్నూరు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారని, విప్ పదవిని కట్టబెట్టారని గుర్తుచేశారు. కేసీఆర్కు రుణపడి ఉంటానని ఎన్నోసార్లు చెప్పావని, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న కారణంగా ఓదెలు భార్య భాగ్యలక్ష్మికి జడ్పీటీసీ టికెట్ ఇచ్చి గెలిపించి, జడ్పీ చైర్పర్సన్ పదవిని ఇచ్చారని తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న నీవు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రచేసిన రేవంత్రెడ్డితో జతకట్టడం చాలా దారుణమమన్నారు. ఎన్నికల సమయంలో ఒక దళితుడిని రెచ్చగొట్టి అతను చనిపోవడానికి కారణమయ్యావని, ఆ కుటుంబాన్ని కనీసం పట్టించుకోలేదన్నారు. చివరకు బాల్క సుమన్ వారికి అండగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, మే 19: చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో నియోజక వర్గంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, ఆయనతో పార్టీకి ఒరిగేదేమీ లేదని ఎంపీపీ మంత్రి బాపు, మున్సిపల్ చైర్మన్ అర్చనా గిల్డా అన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా ఓదెలు ఓడిపోవడం ఖాయమని సర్వేలు వెల్లడించాయని తెలిపారు. దీనిని గమనించిన సీఎం కేసీఆర్ పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్ను పోటీకి దించారని తెలిపారు.
బాల్క సుమన్ సహకారంతో ఓదెలు భార్య నల్లాల భాగ్య లక్ష్మి జడ్పీ చైర్పర్సన్ పదవి దక్కిందన్నారు. ఇవన్నీ చేసిన టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఓదెలు సిగ్గు చేటు అని విమర్శించారు. చెన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజక వర్గానికి కోటి రూపాయల నిధులు కూడా ఓదేలు తేలేదని, కానీ బాల్క సుమన్ మాత్రం ఇప్పటి వరకు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్
నాయకులు పాల్గొన్నారు.
మందమర్రి మే 19: టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పించలేదనడం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు సరికాదని టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఖండించారు. స్థానిక బీ1 టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కన్న తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీని వీడి ఢిల్లీకి గులామైన కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా టీఆర్ఎస్ పార్టీని దూషించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు,పాల్గొన్నారు.