సీసీఐ తుక్కు వేలం నిలిపివేయాలంటూ వార్ కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై మూడు రోజులుగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మొదటి, రెండో రోజూ టీఆర్ఎస్ నాయకులు, సాధన కమిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. గురువారం కంపెనీ భూ నిర్వాసితులు పాత జాతీయ రహదారిపై ఎడ్లబండ్లతో బైఠాయించారు. పరిశ్రమ ఎదుట మాజీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఏఐటీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. తమ భూములు తమకు అప్పగించాలని, సీసీఐని పునరుద్ధరిం చాలని డిమాండ్ చేశారు. కాగా.. పార్లమెంట్ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ చైర్మన్ కేశవరావును ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కలిశారు.
ఆదిలాబాద్, మే 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుటిలయత్నాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూతబడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభించి ఐదు వేల మందికి ఉపాధి కల్పించడంతోపాటు పరిశ్రమ లాభాల బాటన ప్రయాణించే అవకాశాలున్నాయి. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం మొండివైఖరిని ప్రదర్శిస్తున్నది.
ఆదిలాబాద్ సీసీఐని పునః ప్రారంభించడానికి అవకాశాలున్నా అదానీ కంపెనీకి అప్పజెప్పే చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా మోదీ ప్రభుత్వం సీసీఐ యంత్ర సామగ్రిని వేలం వేయడానికి ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 5 నుంచి టెండర్ ప్రక్రియ ప్రారంభం కాగా.. 23 వరకు అవకాశం ఉంది. అనంతరం విలువైన భూములను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం సీసీఐ యంత్ర సామగ్రి వేలం ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.
సిమెంటు పరిశ్రమ యంత్ర సామగ్రి వేలం నిలిపివేయాలంటూ గురువారం మూడో రోజూ ఆందోళనలు కొనసాగాయి. సీసీఐ భూ నిర్వాసితులు ఆదిలాబాద్-నాగ్పూర్ పాత జాతీయ రహదారిపై ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించారు. ఆదిలాబాద్లో సిమెంటు పరిశ్రమ ఏర్పడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని గతంలో తాము తక్కువ ధరకు భూములు విక్రయించామని, కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా పరిశ్రమను మూసివేయడంతో తాము నష్టపోయినట్లు భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు అరవింద్ తెలిపారు.
గతంలో తాము ఇచ్చిన భూముల ధరలు ఇప్పుడు ఎకరానికి రూ.ఒక కోటి ధర పలుకుతున్నాయని, భూముల అమ్మకంతో కేంద్ర ప్రభుత్వం డబ్బులు దండుకోవాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రాంత అభివృద్ధి కోసం భూములను ఇచ్చి నష్టపోయిన తమకు తిరిగి భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. సీసీఐ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మాజీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు అప్పనంగా అప్పగిస్తున్నదని, సీసీఐ వేలం ప్రక్రియను నిలిపివేయాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో పార్లమెంట్ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ చైర్మన్ కే. కేశవరావు ఎమ్మెల్యే జోగు రామన్న కలిశారు. సీసీఐ యంత్ర సామగ్రి వేలం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యే తెలియజేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా కేంద్రం వేలం ప్రక్రియను ప్రారంభించిందన్నారు.
సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో ఆరు నెలలుగా ఆందోళనలు జరుగుతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. స్పందించిన చైర్మన్ కేశవరావు త్వరలో ఢిల్లీలో పార్లమెంట్ పరిశ్రమల స్టాడింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి భూ నిర్వాసితులు, సాధన కమిటీ సభ్యులు, తాను కూడా హాజరవుతానని ఎమ్మెల్యే సూచించారు.