మల్హర్, మే 18 : దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. నిర్వాసితుల కల ఫలించింది. పునరావాస ప్యాకేజీ మంజూరైంది. దీంతో తాడిచర్ల ఎస్సీ కాలనీ, కాపురం నిర్వాసితుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో తాడిచర్ల ఎస్సీకాలనీ, కాపురం గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కింద 232 కుటుంబాలకు రూ.13.01 కోట్ల్లు మంజూరు చేసింది. 2005లో బొగ్గు సేకరణకు తాడిచర్ల ఎస్సీ కాలనీ, కాపురం గ్రామాల్లో కలిపి పట్టాభూమి 723 ఎకరాలు, ప్రభుత్వ భూమి 1400 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2010లో తాడిచర్ల ఎస్సీ కాలనీ, కాపురం గ్రామాల్లో సోషల్ ఎకనామికల్ సర్వే నిర్వహించారు.
కాపురంలో 171, తాడిచర్ల ఎస్సీ కాలనీలో 61 గృహాలు పోతున్నట్లు ఆధికారులు గుర్తించారు. బొగ్గు సేకరణ పనులు 2017 డిసెంబర్లో జెన్కో బోగ్గు వెలికి తీతకు పనులు ప్రారంభించింది. కాపురం గ్రామంలోని ప్రజలు ఓపెన్కాస్టులో బ్లాస్టింగ్తో వచ్చే దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడ్డారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం 2017లో గృహాలకు పరిహారం అందించారు. రెండు గ్రామాల నిర్వాసితులకు అప్పటినుంచి పునరావాస ప్యాకేజీ కోసం పలుమార్లు బొగ్గు వెలికి తీస్తున్న పనులను అడ్డుకున్నారు.
నిర్వాసితుల కోసం ఆర్అండ్ఆర్ కింద ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ముందు భాగంలో 11 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసింది. భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా విధుల్లో చేరిన అనంతరం భూ సేకరణ పనులు వేగవంతం చేశారు. నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు పునరావాస ప్యాకేజీలపై దృష్టి సారించారు. త్వరగా పని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
దీంతో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి సంబంధిత ఫైల్ను కలెక్టర్కు నివేదించారు. దానిని ఆర్అండ్ఆర్ కమిషనర్కు పంపించారు. ఈ క్రమంలో ఈ నెల 10న కమిషనర్ నుంచి కలెక్టర్కు ఆదేశాలు వచ్చాయి. నిర్వాసితుల జాబితాను స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం తహసీల్దార్ అందుబాటులో ఉంచారు.