ఇచ్చోడ, మే 18 : నిషేధిత గుట్కా, గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఒక్క ప్యాకెట్ అమ్మినా, రవాణా చేసినా నివాసాల్లో నిలువ చేసినా కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గుట్కా అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలపై ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్, సెంట్రల్ ఫర్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి విస్తృత దాడులు చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రధానంగా గంజాయి, డ్రగ్స్ కట్టడితో పాటు గుట్కా వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. గతేడాది నుంచి పోలీస్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ ద్వారా నిఘా బృందాలను ఏర్పాటు చేసి, మాదక ద్రవ్యాల గుట్టును రట్టు చేస్తున్నది. నిత్యం వాహనాల తనిఖీలు, నిఘా బృందాల దాడులతో గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నిల్వలను గుర్తించి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడంతో అధిక శాతం గంజాయి విక్రయాలను అరికట్టగలిగారు. అలాగే గుట్కా నియంత్రణపై కూడా చర్యలు చేపట్టారు.
గుట్కా సరఫరా చేసినా, విక్రయించినా ఉపేక్షించేది లేదు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పాన్, కిరాణా షాపుల్లో, అనుమానిత గోదాములపై దాడులు నిర్వహిస్తున్నాం. ప్రతి రోజూ నిఘా బృందాలు తిరుగుతూనే ఉంటాయి. గుట్కా విక్రేతలకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఆకస్మిక దాడులతో విక్రయాలు చాలా వరకు తగ్గాయి. గ్రామాల్లో గంజాయి సాగు, గుట్కా విక్రయాలపై ప్రజలు సమాచారం ఇచ్చి సహకరించాలి.
-ఉదయ్ కుమార్, ఎస్ఐ, ఇచ్చోడ