తానూర్, మే 18 : కొత్త పంచాయతీరాజ్ చట్టం-2018, పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. అభివృద్ధి పనులతో ఊరూరా పచ్చదనం, పరిశుభ్రత కనిపిస్తున్నది. ఒకప్పుడు నిధులు నామమాత్రంగా రావడంతో ఎక్కడ చూసినా సమస్యలే రాజ్యమేలేవి. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మూడేళ్లుగా పల్లె ప్రగతిలో భాగంగా ఊరూరును ప్రగతి పథంలో తీసుకెళ్లింది. ప్రతినెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి క్రమంగా నిధులు అందుతున్నాయి. వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకుముందు పారిశుధ్య పనులకే పరిమితమైన పంచాయతీలు.. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. దీంతో మండలంలోని 31 పంచాయతీల్లో నెలకొన్న ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నది.
మండల వ్యాప్తంగా 31 గ్రామ పంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు ఉద్యమంలా కొనసాగాయి. 2011 నుంచి 2018 వరకు లక్ష్యం చేరుకోవడానికి అధికారులు తీవ్రంగా కృషి చేశారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు ప్రభుత్వమే మంజూరు చేసింది. దీంతో మండలంలో 97 శాతం కుటుంబాలు నిర్మించుకున్నాయి. మిగిలిన వారు పూర్తి చేసుకునేలా పల్లె ప్రగతిలో లక్ష్యాలు నిర్దేశించారు.
ప్రభుత్వం హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఊరూరును పచ్చగా మార్చింది. ఇంతకు ముందు మండలంలో ఒకట్రెండు గ్రామాలకు మొక్కలు పంపించేవారు. ప్రస్తుతం పల్లె ప్రగతిలో భాగంగా పంచాయతీలే స్వయంగా నర్సరీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇంటింటికీ ఆరు చొప్పున మొక్కలు పంపిణీ చేసి పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. నాటిన వాటిలో 85 శాతం బతకకుంటే సర్పంచ్, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటున్నారు.
ఉద్యానవనాలు అంటే పట్టణాలకే పరిమితమయ్యేవి. పల్లెల్లో నడకకు, సేద తీరడానికి ప్రత్యేక ప్రదేశాలు ఉండేవి కాదు. గ్రామీణ వాసులకు ఆహ్లాదం కలిగించేందుకు పల్లె ప్రకృతి వనాలకు శ్రీకారం చుట్టారు. స్థల లభ్యతను బట్టి 10 గుంటల నుంచి ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ప్రజలకు నడక కోసం ట్రాక్లు, కూర్చోవడానికి బల్లలు నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యత పూర్తిగా పంచాయతీలే చూస్తున్నాయి.
పంచాయతీల్లో చెత్త పారవేయడానికి డంప్ యార్డులుండేవి కాదు. చెత్త సేకరణ అంతంత మాత్రంగానే ఉండేది. కొన్ని చోట్ల ఊరి బయట ప్రభుత్వ స్థలాల్లో డంప్ చేసేవారు. పల్లె ప్రగతిలో భాగంగా కంపోస్టు షెడ్లను నిర్మించారు. ఇందులో సేంద్రియ ఎరువు తయారు చేసి హరితహారం మొక్కలకు వాడుతున్నారు. దీనికితోడు గ్రామంలో ఎవరికైనా అవసరముంటే అమ్ముతున్నారు. దీంతో పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతున్నది.
పల్లెల్లో అంతిమ సంస్కారాలకు ఒకప్పుడు తీవ్ర ఇబ్బందులుండేవి. మండలంలోని ఆయా గ్రామాల్లో వైకుంఠధామాలు లేకపోవడంతో చివరి మజిలీకి తిప్పలు తప్పేవికావు. చెరువు, గట్టు, వ్యవసాయ భూముల్లో సంస్కారాలు నిర్వహించేవారు. చివరి చూపునకు వచ్చిన వారు స్నానాలు చేయడానికి ఇబ్బందులుండేవి. ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి పంచాయతీకి వైకుంఠధామాన్ని మంజూరు చేసింది. వాటిని అన్ని హంగులతో తీర్చిదిద్దారు.