పంటల సాగులో మల్చింగ్ విధానం ద్వారా రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా యాసంగిలో గోధుమ, జొన్న, మక్క, శనగ తదితర పంటలు పండిస్తారు. కాలానుగుణంగా కొత్త పద్ధతుల వైపు దృష్టి పెడుతున్నారు. కాగా, మల్చింగ్ విధానంలో ఎక్కువగా కూరగాయలు, పుచ్చకాయ, దోస తదితర పంటలు సాగుచేస్తున్నారు.
– ఉట్నూర్ రూరల్, మే 18
కూరగాయాల సాగులో రైతులు బిందు సేద్యం, మల్చింగ్ విధానం ప్రస్తుతం పాటిస్తున్నారు. వేసవిలో నీటి కొరత ఉండడంతో, బిందు సేద్యం వైపు దృష్టి పెడుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. మొక్కలకు రసాయన ఎరువులు కూడా బిందు సేద్యం ద్వారా అందిస్తారు. కలుపు నివారణకు మల్చింగ్ పద్ధతిని పాటించి పంటలు సాగు చేస్తున్నారు. దీంతో సమయంతోపాటు 50 శాతం ఖర్చు తగ్గుతుంది.
ముందుగా పంట భూమిని మట్టి పెల్లలు లేకుండా దుక్కిదున్ని బెడ్లు తయారు చేసి, ఎత్తుగా ఉన్న బెడ్పై డ్రిప్ పైపు వేస్తారు. ఆ తురువాత డ్రిప్ పైపు ఉన్న బెడ్పై ప్లాస్టిక్ కవర్(మల్చింగ్) వేస్తారు. డ్రిప్ పైపు రంద్రం ఉన్న చోట కవర్కు రంద్ర చేసి విత్తనాలు నాటుతారు. ఇలా చేయడం ద్వారా మొక్క ఉన్న చోటే నీరు అందుతుంది. కలుపు మొక్కలు అసలే ఉండవు. రైతులు కలుపు నివారణకు అత్యధికంగా ఖర్చు చేస్తారు. కొందరు మందులు పిచికారీ చేస్తారు. దీంతో పంట ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. మల్చింగ్ సాగులో ఇలాంటి బాధలు ఉండవు. ఉద్యానవన అధికారులు కూడా ఈ విధాపంపై అవగాహన కల్పిస్తున్నారు.
మల్చింగ్ పద్ధతిలో పుచ్చకాయ సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. మండలంలో చాందూరితోపాటు పలు గ్రామాల్లో పుచ్చకాయ సాగు చేస్తున్నారు. ఇతర పంటలతో పోల్చుకుంటే సమయం, ఖర్చు, శ్రమ తక్కువ ఉండడంతో ఆసక్తి చూపుతున్నారు. వేసవిలో పుచ్చకాయకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. వ్యాపారులే నేరుగా రైతుల చేల లోకి వచ్చి నాణ్యతను బట్టి కోతకు ముందే డబ్బులు ఇచ్చి విడుతలవారీగా పంట కోసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బజార్హత్నూర్, కలమడుగు, తాంసి, భీంపూర్, జైనథ్, ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతల్లో సుమారు 120 ఎకరాల్లో పుచ్చకాయ సాగు చేస్తున్నారు.
యాసంగిలో పుచ్చకాయ సాగుచేయడం వల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయి. బిందు సేద్యం ద్వారా సాగుచేస్తే మరింత శ్రమ తగ్గుతుంది. ఎకరాకు సుమారు రూ. 50 వేల వరకు ఖర్చు వస్తుంది. రెండు నుంచి మూడు నెలల్లోపు కోతకు వస్తుంది. రూ. లక్ష వరకు వరకు ఆదాయం వస్తుంది. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చే పంటలు వేసుకోవాలి. మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు కూడా సాగు చేయవచ్చు, రైతులు సంప్రదిస్తే ఈ విధానంపై అవగాహన కల్పిస్తాం.
– మహేశ్, ఉద్యానవన అధికారి